కారును అటకాయించి.. సహచరుడిని చంపి, పిల్లలను కొట్టి.. మహిళలపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

గురువారం, 25 మే 2017 (11:39 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆటవిక చర్య చోటుచేసుకుంది. కొందరు దుండగులు కారును అటకాయించి సహచరుడిని చంపేసి, పిల్లలను కొట్టి దోపిడి చేయడమేకాకుండా, కారులో ఉన్న నలుగురు యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాతిఘోరం బుధవారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బుధవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది సభ్యులు ఒక కారులో బులంద్ షహర్‌కు బయలుదేరారు. దేశ రాజధాని శివార్లలోని గ్రేటర్ నోయిడా రీజియన్ పరిధిలోని జీవర్ - బులంద్ షహర్ జాతీయ రహదారిపై వెళుతుండగా, కొందరు దుండగులు కారును అటకాయించారు. ఆ బృందంలోని పురుషుడిని హత్య చేసి, పిల్లలను కొట్టి, వారి వద్దనున్న నగలు, నగదును దోచుకోవడమేకాకుండా, నలుగురు మహిళలపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.
 
పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, దాడిలో కనీసం ఆరుగురు వ్యక్తులు భారీ ఎత్తున ఆయుధాలతో వచ్చి పాల్గొన్నారు. తొలుత కారు టైరును తుపాకిని పేల్చి పంచర్ చేసిన దుండగులు, ఆపై దారుణానికి ఒడిగట్టారు. తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు వారితో తలపడిన వ్యక్తిని తుపాకితో కాల్చి చంపారు. వారి వద్ద ఉన్న రూ.14 వేల నగదును అపహరించుకుపోయారని తెలిపారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పిల్లలను ఆస్పత్రికి తరలించగా అత్యాచారానికి గురైన మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన వైద్యులు... దుండగుల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి