తప్పుడు ధృవీకరణ పత్రాల సమర్పణ : పూజా ఖేడ్కర్‌పై జీవితకాల నిషేధం!!

వరుణ్

బుధవారం, 31 జులై 2024 (17:15 IST)
యూపీఎస్సీ సెలక్షన్ సమయంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టు తేలడంతో పూణె సబ్ కలెక్టరుగా పని చేసిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌పై జీవితకాల నిషేధం పడింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీచేసింది. యూపీఎస్సీ సెలెక్షన్ సమయంలోనూ తప్పుడు పత్రాలు సమర్పించినట్టు తేలడంతో భవిష్యత్తులో సివిల్స్‌లో పాల్గొనకుండా పూజా ఖేద్కర్‌పై ఈ నిషేధం విధించారు. 
 
పూజా ఖేడ్కర్ పుణే ప్రొబేషనరీ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు, సెలెక్షన్ సమయంలో యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. పూజా ఖేడ్కర్ మీద వచ్చిన ఆరోపణలపై ఇటీవలే కేంద్రం నియమించిన ఏకసభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కి నివేదిక సమర్పించింది. 
 
మహారాష్ట్రకు చెందిన వైభవ్ కోకట్ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌తో పూజా ఖేద్కర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖరీదైన ఆడి కారుతో పూజా ఖేడ్కర్ ఫొటోను వైభవ్ కోకట్ పోస్టు చేశారు. దాంతో అందరి దృష్టి ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌పైకి మళ్లింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఆమె యూపీఎస్సీ సెలెక్షన్ కోసం చేసిన అక్రమాలు కూడా వెలుగు చూశాయి. దీంతో యూపీపీఎస్సీ చైర్మన్ కూడా మరో మూడేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు