లాక్డౌన్‌తో కరోనాకు కట్టు : 17 వరకు పొడగిస్తున్నాం : అరవింద్ కేజ్రీవాల్

ఆదివారం, 9 మే 2021 (13:24 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. ఈ వైరస్ బారినపడిన అనేక మంది మృత్యువాతపడ్డారు. దీంతో వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేశారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఈ రోజు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... ఢిల్లీలో లాక్డౌన్ కార‌ణంగా పాజిటివిటీ రేటు 35 నుంచి 23 శాతానికి త‌గ్గిందని తెలిపారు. దీనికి నిదర్శనమే శనివారం 17,364 కేసులు న‌మోద‌య్యాయ‌ని చెప్పారు.
 
అందుకే ఢిల్లీలో మ‌రోసారి లాక్డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నెల 17 వ‌ర‌కు లాక్డౌన్ ఉంటుంద‌ని చెప్పారు. లాక్డౌన్ కాలాన్ని తాము వైద్య మౌలిక స‌దుపాయాల‌ను పెంచుకునేందుకు వాడామన్నారు. 
 
అలాగే, ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లోని ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ బెడ్ల సంఖ్య‌ను పెంచుకునేందుకు వినియోగించామని అన్నారు. ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజ‌న్ కొర‌త త‌గ్గిందన్నారు. ఢిల్లీలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోందని వివ‌రించారు. 
 
యువ‌కులు చాలా మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని వివరించారు. ఢిల్లీలో వ్యాక్సిన్ డోసులు త‌క్కువ‌గా అందుబాటులో ఉన్నాయని, కేంద్ర ప్ర‌భుత్వం సాయం చేస్తుంద‌ని మేము ఆశిస్తున్నామని చెప్పారు.
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశంలోని 40 శాతం జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు ఉంద‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 741 జిల్లాలకుగానూ 301 జిల్లాల్లో 20 శాతం అంత‌కుమించి పాజిటివిటీ న‌మోదువుత‌న్న‌ద‌ని తెలిపింది. వాటిలో 15 జిల్లాల్లో అయితే ఏకంగా 50 శాతానికిపైగానే పాజిటివిటీ రేటు ఉంద‌ని పేర్కొన్న‌ది.
 
ఆ 15 జిల్లాల్లో హ‌ర్యానా జిల్లాలు నాలుగు, అరుణాచల్‌ప్రదేశ్ జిల్లాలు రెండు, రాజస్థాన్ జిల్లాలు రెండు కాగా.. మ‌రో ఏడు జిల్లాలు ఏడు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చంగ్లాంగ్‌ జిల్లాలో అత్యధికంగా 91.5 శాతం పాజిటివిటీ రేటు ఉందని, అదే రాష్ట్రంలోని దిబాన్‌ వ్యాలీతోపాటు పుదుచ్చేరిలోని యానాం, రాజస్థాన్‌లోని బికనీర్‌, పాలీ జిల్లాల్లో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతున్నద‌ని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
 
ఇక కేరళలోని 14 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాటిజివిటీ రేటు నమోదువుతుంది. హ‌ర్యానాలో 22 జిల్లాలకుగాను 19 జిల్లాల్లో, పశ్చిమబెంగాల్‌లో 23 జిల్లాల‌కుగాను 19 జిల్లాల్లో, ఢిల్లీలో 11 జిల్లాల‌కుగాను 9 జిల్లాల్లో, కర్ణాటకలో 31 జిల్లాల‌కుగాను 24 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20 శాతానికిపైగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ప‌లు రాష్ట్రాలు లాక్డౌన్‌లు, క‌ర్ఫ్యూలు విధిస్తున్నా ప‌రిస్థితి అద‌పులోకి రాక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు