జాతీయ సెలవుదినం జాబితా నుంచి క్రిస్మస్ తొలగింపు.. మండిపడిన మమత!

మంగళవారం, 22 డిశెంబరు 2020 (12:25 IST)
క్రైస్తవ సోదరులు జరుపుకునే అతిముఖ్యమైన పండుగల్లో ఒకటి క్రిస్మస్. డిసెంబరు 25వ తేదీన జాతీయ సెలవుదినంగా ఇప్పటివరకు పాటిస్తూ వచ్చారు. కానీ, జాతీయ సెలవు దినం జాబితా నుంచి కిస్మస్‌ను కేంద్రం తొలగించింది. దీనిపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. 
 
క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం నాడు జాతీయ సెలవు దినాన్ని ప్రకటించక పోవడమనేది మత ద్వేష రాజకీయాలను ప్రోత్సహించాలన్న బీజేపీ అజెండాయేనని ఆమె ఆరోపించారు. 
 
తాజాగా కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆమె, "గత సంవత్సరం చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. జీసస్ జన్మదినాన్ని జాతీయ సెలవుగా ఎందుకు ప్రకటించడం లేదు? గతంలో ఉన్న సెలవును బీజేపీ ప్రభుత్వం ఎందుకు తొలగించింది? ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్లు ఉంటాయి. క్రిస్మస్ పండగ ఏం తప్పు చేసింది. ఈ పండగను ప్రపంచమంతా జరుపుకుంటారని తెలియదా?" అని మమత ప్రశ్నించారు.
 
కాగా, ఈ యేడాది కరోనా మహమ్మారి కారణంగా పూర్తి స్థాయి వేడుకలకు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని పేర్కొన్న ఆమె, ప్రజలంతా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, ఏసు జన్మదిన వేడుకలను జరుపుకోవాలని సూచించారు. 
 
మన దేశంలో లౌకికవాదాన్ని నాశనం చేయడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో అత్యంత క్రూరమైన మత రాజకీయాలు సాగుతున్నాయని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు