ఏపీ గవర్నర్‌గా యడ్యూరప్ప వస్తారా?

శుక్రవారం, 9 జులై 2021 (23:41 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను పదవీ గండం పట్టుకున్నట్లు ఉంది. కరోనా సమయంలో పాలన సరిగ్గా లేదంటూ సొంత పార్టీలోని నేతలే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అసలు స్థానిక నేతలను కూడా యడ్యూరప్ప పట్టించుకోవడం లేదని సీనియర్ నేతలు అలకపాన్పులు ఎక్కారు.
 
అసలు కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలియక తలలు పీక్కున్నారు అగ్రనేతలు. స్థానిక బిజెపి నేతలను సద్దుమణిగించేందుకు సాక్షాత్తు బిజెపి పెద్దలే రంగంలోకి దిగి ఆ పని చేశారు. కానీ అది ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. యడ్యూరప్పను ఆ పదవి నుంచి పూర్తిగా తొలగించాలన్న డిమాండ్ ఎక్కువగా వినబడింది. 
 
దీంతో అధిష్టానం యడ్యూరప్పను దూరం చేసుకోలేక ఆయన్ను గవర్నర్‌గా నియమించాలన్న నిర్ణయానికి వచ్చేసిందట. ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ కాలం ఈనెల 23వ తేదీతో ముగియనుంది. కాబట్టి ఆయన స్థానంలో యడ్యూరప్పను నియమించాలన్న నిర్ణయానికి వచ్చేశారట బిజెపి అధిష్టానం.
 
సాక్షాత్తు బిజెపి అగ్రనేత అమిత్ షానే ఇందుకు ఒకే కూడా చెప్పేశారట. బిశ్వభూషణ్ ఇలా వెళ్ళడం.. యడ్యూరప్ప ఇలా రావడం రెండూ ఒకేసారి జరిగిపోవాలన్నది అమిత్ షా ఆలోచనట. కానీ ఈ విషయాన్ని యడ్యూరప్పకు ఇంతవరకు చెప్పలేదట. చెబితే ఏవిధంగా రియాక్ట్ అవుతారని వారు ఆలోచనలో ఉన్నారట.
 
ముఖ్యమంత్రిగా కాకుండా గవర్నర్‌గా పనిచేయడం యడ్యూరప్పకు ఏ మాత్రం ఇష్టం లేదనేది వారి సన్నిహితులు చెబుతున్న మాట. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం యడ్యూరప్పను ఏ విధంగా ఒప్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.

వెబ్దునియా పై చదవండి