ముంబై ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి...

ఠాగూర్

ఆదివారం, 18 ఆగస్టు 2024 (16:46 IST)
కోల్‍‌కతా ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో జూనియర్ మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఈ వేడి సద్దుమణకముందే... ముంబై ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగితో పాటు మరో ఐదారుగురు వ్యక్తులు దాడి చేసి డాక్టర్‌ను గాయపరిచారు. ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పేషెంట్‌తో సహా అందరూ మద్యం మత్తులో ఉన్నారని, డాక్టర్‌ను పరుష పదజాలంతో దూషిస్తూ ఆస్పత్రిలో గొడవకు దిగారని తెలిపారు. 
 
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని సియోన్ ఆసుపత్రికి ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ముఖంపై గాయాలతో రక్తమోడుతూ వచ్చాడు. ఆయనతో ఐదారుగురు వ్యక్తులు తోడుగా వచ్చారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. వార్డులో విధులు నిర్వర్తిస్తున్న రెసిడెంట్ డాక్టర్ ఈ పేషెంట్‌ను అటెండ్ అయ్యారు. గాయాలకు చికిత్స చేస్తుండగా పేషెంట్ తిట్లదండకం మొదలు పెట్టాడు. 
 
ఆపై మహిళా వైద్యురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలికి గాయాలయ్యాయి. వైద్యురాలి కేకలతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా నిందితులు అందరూ పారిపోయారు. ఈ ఘటనపై బాధిత డాక్టర్ సియోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు