ఆవాస్‌ యోజన కింద ఇల్లు ఇప్పిస్తామంటూ.. యువతిపై అత్యాచారం

ఆదివారం, 10 అక్టోబరు 2021 (15:47 IST)
నిర్భయ లాంటి చట్టాలున్నప్పటికీ.. దేశంలో అత్యాచారాల పర్వం ఆగడం లేదు. కామాంధులు రోజుకోవిధంగా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇల్లు ఇప్పిస్తామంటూ.. ఇద్దరు యువకులు ఓ యువతి (22) పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. అక్కడినుంచి పరారయ్యారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని భోపా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 
 
యువతిపై యోగేశ్‌ కుమార్, బబ్లు అనే ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు భోపా పోలీసులు శనివారం తెలిపారు. అయితే.. ఈ అత్యాచార ఘటనను నిందితుల్లో ఒకరు ఫొన్లో రికార్డు చేశారని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ వీడియోతో యువతిని వేధించడం మొదలుపెట్టారు.
 
ఈ క్రమంలో గురువారం ఫోన్‌ నుంచి వీడియో తొలగిస్తానని చెప్పి.. పొలం దగ్గరికి యువతిని రప్పించిన యోగేశ్‌ కుమార్‌ మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తొలగించకపోగా.. మరలా బెదిరింపులకు పాల్పడటంతో చివరకు యువతి పోలీసులను ఆశ్రయించిందని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ రాజ్ కుమార్ తెలిపారు. 
 
యువతి ఫిర్యాదు మేరకు సెక్షన్ 376, 506 కింద ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపామని.. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు. వైద్య పరీక్షల రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు రాజ్ కుమార్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు