నవరాత్రులు.. చదువులమ్మను, దుర్గమ్మను ఇలా పూజిస్తే?

మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:57 IST)
నవరాత్రుల సందర్భంగా ముగ్గురమ్మల పూజలో సరస్వతీ పూజ విశిష్టమైనవి. శ్రీ సరస్వతీ కవచంతో పాటు నవరాత్రుల వేళ అమ్మవారికి అష్టోత్తర నామాలు, సహస్ర నామాలు చదువుతూ పూజించాలి. అలాగే దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయాలి. 
 
సరస్వతీ పూజ చేసే సమయంలో పెద్దవారు మాత్రమే ఉపవాసం ఉండాలి, అంటే 15 సంవత్సరాలలోపు పిల్లలు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. సరస్వతీ పూజకి తెల్లపూలు వాడాలి.
 
చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్లవస్త్రాలు, లేదా పట్టుబట్టలు ధరించాలి. అమ్మవారిముందు తాము చదువుకునే పుస్తకాలు, పెన్నులు ఉంచి, అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలు కూడా పూజించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే నవరాత్రుల్లో ఆది పరాశక్తి అవతారమైన దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన సందర్భంగా దుర్గాష్టమిని నిర్వహిస్తారు. శక్తి స్వరూపమైన అమ్మవారు దుర్గాష్టమి రోజున భక్తులకు పూజలు అందుకుంటుంది. 
 
అష్టమి తిథిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఆ రోజు ఉపవాసముంటారు. బియ్యం, కాయధాన్యాలు, గోధుమలను ఏ రూపంలోనైనా ఉపవాసం రోజు మాత్రం భుజించకూడదు. 
 
అందువల్ల ప్రజలు వ్రతం రోజు పండ్లు, పాలను ఆహారంగా తీసుకుంటారు. అంతేకాకుండా ఆరోజు వేకువ జామునే నిద్రలేస్తారు. అనంతరం ధ్యానం చేసి దుర్గాదేవిని ప్రార్థిస్తారు. ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే చమురు దీపాన్ని వెలిగిస్తారు. దీన్ని అఖండ జ్యోతి అని పిలుస్తారు. 
 
దుర్గమ్మ ఆశీర్వాదం కోసం అమ్మవారి కథ లేదా దుర్గా సప్తశతిని పఠిస్తూ ఆ రోజు గడుపుతారు. కొంతమంది చిన్నారులు కూడా అమ్మవారికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ పూజను కుమారి పూజ అని అంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు