ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

ఠాగూర్

ఆదివారం, 19 అక్టోబరు 2025 (13:25 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రోజురోజుకూ బలపడుతుంది. ఇది మంగళవారానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. ఈ ప్రభావం కారణంగా తెలంగాణాలోనూ పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఆదివారం ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
అలాగే, తెలంగాణా రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురవచ్చని తెలిపింది. సోమవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగుతో పాటు రాజధాని హైదరాబాద్ నగరంతో సహా చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ రెండు రోజులు పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములతో వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు