ఆటా ప్రత్యేక సమావేశం : కార్యవర్గం ఎంపిక

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ట్రస్ట్ బోర్డు మే 2వ తేదీన న్యూజెర్సీలోని వింధామ్ గార్డెన్ హోటల్‌లో అత్యవసరంగా సమావేశమైంది. 23 మంది ప్రస్తుత బోర్డు సభ్యులు, మరికొంతమంది మాజీ అధ్యక్షులు, తదితర బోర్డు సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో... కొత్త ఎగ్జిక్యూటివ్ సభ్యులను, స్టాండింగ్ కమిటీ సభ్యులను, రీజినల్ కో-ఆర్డినేటర్లను నియమించింది. అంతేగాకుండా, 11వ ఆటా (ఏటీఏ) కాన్ఫరెన్స్ కన్వీనర్, కోఆర్డినేటర్, అడ్‌హాక్ కమిటీని బోర్డు నియమించింది.

ఈ విషయమై ఆటా అధ్యక్షుడు జితేందర్ ఎం రెడ్డి, కార్యదర్శి రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ... జనవరి 24నాటి బోర్డు సమావేశం తీసుకున్న నిర్ణయాలపై నెలకొన్న సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు ప్రకటించారు. అలాగే, సంస్థ నిర్వహించే కార్యక్రమాల గురించి చర్చించటమే గాకుండా, రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను చూసే అడ్‌హక్ కమిటీ నియమించినట్లు వారు వెల్లడించారు.

అంతేగాకుండా, 10వ ఆటా మహాసభలు, యూత్ కన్వెన్షన్‌కు సంబంధించిన అకౌంట్ల తనిఖీ కోసం ఆడిట్ కమిటీ సభ్యుల నియామకం, నామినేటింగ్ సభ్యుల నియామకం, భవిష్యత్‌లో ఆటా సమావేశాలు నిర్వహించాల్సిన తేదీలు... తదితర అంశాలపై ఈ అత్యవసర సమావేశంలో చర్చించినట్లు ఆటా అధ్యక్ష, కార్యదర్శులు వివరించారు.

వెబ్దునియా పై చదవండి