అమెరికాలో భారత ఐటీ ఉద్యోగుల సమాఖ్య

FILE
అమెరికాలో భారత సంతతికి చెందిన ఐటీ ఉద్యోగులందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో "ఐటీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఐటీపీఐఓ)" పేరుతో ఓ సమాఖ్యను ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సిలికాన్ వ్యాలీలో దీనిని ఏర్పాటు చేసినట్లు సమాఖ్య వ్యవస్థాపకుడు ఖాందరావుకంద్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఖాందరావుకంద్ మాట్లాడుతూ... ఓ ఒక్క సంస్థ తోడ్పాటు లేనప్పటికీ, భారతీయ సాంకేతిక నిపుణులు తమ రంగంలోని పనితీరుపట్ల అవగాహన పెంచుకుని అనేక విజయాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఐటీ రంగానికి సంబంధించి ప్రపంచంలో నమోదవుతున్న ప్రతి విజయంలో భారతీయుల పాత్ర ఉండేందుకు కృషి చేయటమే ఈ సమాఖ్య ముఖ్యోద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఐటీ రంగంలోనే కాక, ఇతర రంగాల్లోని ప్రవాస భారతీయుల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు ఈ సమాఖ్య కృషి చేస్తోందని సిలికాన్ వ్యాలీకి చెందిన పిలాంథ్రోపిస్ట్, మైక్రోటెక్ సంస్థ సీఈఓ శ్రీచావ్లా ఈమేరకు తెలియజేశారు. కాగా... ప్రాథమికంగా నాయకత్వ, వ్యక్తిత్వ వృద్ధికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించే ఈ సంస్థ సిలికాన్ వ్యాలీతోపాటు డెన్వర్, వాషింగ్టన్, సియాటెల్, హైదరాబాద్, బెంగళూరులలో తన కార్యకలాపాలను ప్రారంభించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి