భద్రతపై దిగులు వద్దు : కన్నన్ వాల్టన్

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల భద్రత గురించి దిగులు చెందవద్దని, విద్యార్థుల రక్షణ కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని... ఆ దేశ ప్రతినిధి కన్నన్ వాల్టన్ హామీనిచ్చారు. భారత విద్యార్థుల తల్లిదండ్రులతో గురువారం సచివాలయంలో భేటీ అయిన ఆసీస్ ప్రతినిధులు పై విధంగా స్పందించారు.

ఈ సందర్భంగా దాడులకు గురయిన విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ... తమ పిల్లలకు రక్షణ కల్పించడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం విఫలమైందంటూ ఆ దేశ ప్రతినిధులను నిలదీశారు. దీనికి ప్రతినిధులు సమాధానం ఇస్తూ, భారత్‌లో ఉన్నన్ని నియమాలు ఆస్ట్రేలియాలో లేకపోవడం వల్ల వెంటనే స్పందించలేదని వివరణ ఇచ్చారు.

భారతీయ విద్యార్థులు ఉండే చోట ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, భద్రతపై ఆందోళన చెందవద్దని ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరిగిన వరుస జాత్యహంకార దాడులతో భీతిల్లిన విద్యార్థులు ఆ దేశం తమకు సురక్షితం కాదన్న భావన నెలకొంది.

అయితే విద్యార్థుల భద్రతకు భరోసా ఇచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ ప్రతినిధుల బృందాన్ని భారత్ పర్యటనకు పంపించిన సంగతి తెలిసిందే...! ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విచ్చేసిన ప్రతినిధుల బృందం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై.. విద్యార్థుల భద్రతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.

వెబ్దునియా పై చదవండి