యూఏఈ సానుకూలంగా స్పందించాలి: భారత్ ఆశాభావం

FILE
దుబాయ్‌లో మరణశిక్షకు గురైన 17 మంది భారతీయుల అప్పీల్‌కు యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ సానుకూలంగా స్పందించగలదని భారత్ ఆశిస్తోంది. మరణశిక్షకు వ్యతిరేకంగా భారత నిందితులు దాఖలు చేసిన అప్పీల్‌ను యూఏఈ బుధవారంనాడు పరిశీలించనుంది. దీంతో భారతీయుల అప్పీల్‌పై యూఏఈ సానుకూల స్పందన కోసం భారత్ ఎదురుచూస్తోంది.

కాగా.. ఒక పాకిస్తాన్ యువకుడి హత్యతోపాటు, మరో ముగ్గురు పాక్ యువకులను గాయపరిచినందుకుగానూ 17మంది భారతీయులకు మార్చి 29న షార్జాలోని షరియత్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే తమ తీర్పుపై భారతీయ నిందితులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందనీ యూఏఈ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితుల తరపున వాదించేందుకుగానూ భారత ప్రభుత్వం మొహమ్మద్ సల్మాన్ అనే న్యాయవాదిని నియమించింది.

నిందితులు మరణశిక్షకు వ్యతిరేకంగా చేసుకున్న అప్పీల్‌ను విచారించి, తీర్పును వెలువరించేందుకు రెండువారాల సమయం పడుతుందని ఈ మేరకు యూఏఈ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమ దేశ న్యాయవ్యవస్థ, చట్టాలపై పూర్తి విశ్వాసం ఉందనీ.. అదే విధంగా విచారణ విషయంలోనూ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని న్యూఢిల్లీలోని యూఏఈ ఎంబసీ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరణశిక్ష కేసులో భారతీయ నిందితులకు యూఏఈ సానుకూలంగా స్పందించగలదని భారత్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి