సాయిదత్త పీఠం ఆధ్వరంలో యోగా దినోత్సవం: అమెరికన్లకు యోగా పాఠాలు నేర్పిన విజయ నిమ్మ

మంగళవారం, 22 జూన్ 2021 (20:31 IST)
ఎడిసన్- న్యూ జెర్సీ: న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించారు. ఈ సందర్బంగా యోగాను భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనా.. అది ప్రపంచానికి ఎంత  మేలు చేస్తుందనేది ఈ సందర్భంగా ప్రముఖ యోగా శిక్షకురాలు డా. విజయ నిమ్మ వివరించారు.
 
యోగాసనాలు వేయించి అవి ఆరోగ్యానికి ఎంత ఉపకరిస్తాయనేది తెలిపారు. ఆ తర్వాత తాను విధులు నిర్వహించే నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో డా. విజయ నిమ్మ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేశారు. నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్ సీఈఓ డాక్టర్ కెర్రీ పొవెల్.. విజయ నిమ్మ విజ్ఞప్తిని పరిశీలించి సంస్థలో యోగా దినోత్సవాన్ని జరిపేందుకు సంతోషంగా ఒప్పుకున్నారు.
 
సీఓఓ మిస్టర్ జాన్ బోన్, సైట్ అడ్మినిస్ట్రేటర్ హాజీరబేజ్ ఖాన్ నాయకత్వంలో ఈ యోగా దినోత్సవం జరిగింది. కార్పొరేషన్ సీఎంఓ డాక్టర్ పెన్నింగ్టన్ కూడా ఇందుకు తనవంతు పూర్తి సహకారం అందించారు. దీంతో డా. విజయ, ఈ కార్పొరేషన్ ఉద్యోగులకు యోగాపై అవగాహన పెంచారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. వారి చేత యోగాసనాలు వేయించారు. ఆ ఆసనాల వల్ల కలిగే లాభాలను స్పష్టంగా తెలిపారు.
 
సాయిదత్త పీఠం గురుకులంలో యోగా శిక్షకురాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సాయి దత్త పీఠంలో జరపడంతో పాటు నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో కూడా యోగా దినోత్సవాన్ని చేయడం పట్ల సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి హర్షం వ్యక్తం చేశారు. యోగా దినోత్సవం నాడు అందరికి యోగాపై అవగాహన కల్పించినందుకు డా.విజయ నిమ్మను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు ఆ సాయినాధ, శ్రీ మాతా కృప సదా ఉండాలని ఆశీర్వదించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు