చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనార్థం అమలు చేసిన మహాద్వార ప్రవేశాన్ని రద్దు చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది.
బుధవారం తిరుమలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ డీకే ఆదికేశవులు ఈ విషయాన్ని సూత్రప్రాయంగా తెలిపారు. మహాద్వార దర్శనానికి బదులు బుధవారం నుంచి తితిదే అమలు చేసిన శీఘ్రదర్శనం క్యూలైన్లలో వీరిని అనుమతించాలని భావిస్తున్నారు.
మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ప్రారంభమయ్యే శీఘ్రదర్శనం క్యూలైన్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఉండటమే గాకుండా.. ఈ మార్గంలో వారిని అనుమతించడంవల్ల లగేజీ స్కానింగ్ కూడా సాధ్యపడుతుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఛైర్మన్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. శ్రీవారి ఘంటారావాన్ని బుధవారం నుంచి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించారు. స్వామివారి నివేదన ఘంటానాదాన్ని ఉదయం, రాత్రి ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేశారు.