తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

ఠాగూర్

ఆదివారం, 22 జూన్ 2025 (09:21 IST)
ఏపీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో అరెస్టు అయిన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత జగన్ ప్రభుత్వంలో భారీగా అవినీతికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా (తుడా) ఉన్న ఆయన తుడా నిధులను భారీగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. రూ.2 కోట్లు పెట్టి కార్లు కొనుగోలు చేసి, ఆ కార్లు నడిచేందుకు పెట్రోల్ కోసం ఏకంగా రూ.2.60 కోట్లు ఖర్చు చేసినట్టు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. అలాగే, తన సొంతూరులో చెరువు అభివృద్ధికి రూ.50 కోట్లు ఖర్చు చేశారు. ఇలా నిధులను కొల్లగొట్టి తుడాను దివాళా తీయించారు. చైర్మన్ హోదాలో తుడా నిధులను ఎడాపెడా వాడేశారు. తన ప్రాబల్యం పెంచుకునేందుకు ఆయన తుడా నిధులను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసినట్టు సమాచారం. 
 
గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలంతా అరాచాకమే హద్దుగా చెలరేగిపోయిన విషయం తెల్సిందే. ప్రభుత్వ సంస్థలను తమ ఇంటి సంస్థలుగా వాడుకున్నారు. ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెట్టేశారు. తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల విమాన టిక్కెట్ల కోసమే తుడా నిధులను రూ.60 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. 
 
తిరుపతి నగరాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తుడాలో గత 2019లో టీడీపీ అధికారం నుంచి దిగిపోయే సమయానికి మిగులు నిధులు ఉండగా, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు కలిసి తుడాను పూర్తిగా దివాళా తీయించినట్టు వినికిడి. తుడా పరిధిలో పచ్చదనం పెంపు పేరిట కోట్లాది రూపాయలను దిగమింగారని, మొత్తం రూ.16 లక్షల మొక్కల పంపిణీ, పార్కుల్లో పచ్చదనం పేరిట రూ.14 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించినట్టు తెలుస్తోంది. 
 
అలాగే, బెంచీల కొనుగోళ్లకు మరో రూ.23 కోట్లు ఖర్చు చేసినట్టు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్ట్ విధానంలో 25 మంది ఉద్యోగులను నియమించి, వారికి నెలకు రూ.35 వేలు చొప్పున ఒక్కో ఉద్యోగికి వేతనం చెల్లించారనీ, కానీ, వీరంతా ఏ ఒక్క రోజు కూడా తుడాలో పనిచేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. అలాగే, ఉద్యాన విభాగం మరో రూ.6 కోట్లు ఖర్చు చేసి పచ్చదనాన్ని పెంపొందించింది. 
 
ఒక్క చెరువు మీదే దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. తుడా నిధుల్లో రూ.240 కోట్లను చంద్రగిరి నియోజకవర్గంలో కొందరు ఎంపీడీవోల ఖాతాల్లోకి మళ్లించి అభివృద్ధి చేసినట్టుగా లెక్కల్లో చూపించారు. పైగా, ఆ పనులన్నీ చెవిరెడ్డి కుటుంబ సభ్యులకే కట్టబెట్టారు. అంతేనా ఆ పనుల అంచనాలు పెంచేసి తుడా నిధులను దోచుకున్నారు. తాజాగా విజిలెన్స్ అధికారుల తనిఖీలో చెవిరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు