తితిదేకి ఈఓ ఉన్నారా...? ఉంటే ఎక్కడున్నారు?

బుధవారం, 17 మే 2017 (13:15 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే ఆధ్మాత్మిక సంస్థల్లో ప్రధానమైనది. ఈ సంస్థ మాత్రమే కాదు ప్రతిరోజు వేలాదిగా వచ్చే భక్తులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాలంటే అన్నీ తితిదే ఉన్నతాధికారులు తీసుకోవాల్సిందే. మొత్తం తితిదేకి ముగ్గురు బాస్‌లు. ఒకరు తితిదే ఈఓ, మరో ఇద్దరు తిరుపతి, తిరుమల జెఈఓలు. ఇలా ముగ్గురుంటారు. ఇందులో కార్యనిర్వహణాధికారి (ఈఓ) ప్రధానం. పరిపాలనకు సంబంధించిన ఏ వ్యవహారం తీసుకోవాలన్నా ఆయన చేయాల్సిందే. అయితే కొత్తగా వచ్చిన ఈఓ వ్యవహారాలపై పెద్దగా దృష్టిసారించలేదట. ఇప్పటికే ఉత్తరాదికి చెందిన వ్యక్తిగా ముద్ర పడిన కొత్త ఈఓ ఇప్పుడే పాలనా వ్యవహారాల్లో తలదూర్చి మరింత విమర్శలు తెచ్చుకోకుండా మెల్లమెల్లగా వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నారట. 
 
అనిల్ కుమార్ సింఘాల్.. తితిదే కొత్త ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్యనే ఆయన బాధ్యతలు స్వీకరించినా ఆయనపై విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. కారణం ఆయన ఉత్తరాదికి చెందిన వ్యక్తి కాబట్టి. మొదటగా విశాఖ శారదాపీఠాధిపతితో ప్రారంభమైన విమర్శలు ఆ తర్వాత సినీనటుడు పవన్ కళ్యాణ్.. మిగిలిన వారు ఒక్కొక్కరు ఆయనపై విమర్శలు చేసిన వారే. దీంతో ఒక్కసారిగా ఈఓ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక వారి విమర్శలకు ఎలాంటి ప్రతివిమర్శలు చేయకుండానే సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నారు ఈఓ. అయితే ఎలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు. 
 
అప్పుడప్పుడు స్వామి, అమ్మవార్ల వాహన సేవలకు వెళ్ళడం.. మళ్ళీ ఆఫీసుకు రావడం.. ఇలా కానిచ్చేస్తున్నారు. సామాన్య భక్తులకు అవసరమయ్యే నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు. ఇప్పటివరకు భక్తులకు అవసరమయ్యే నిర్ణయాలు పెద్దగా తీసుకోకపోవడంతో ఆయనపై మరింత విమర్శలు వస్తున్నాయి. దీంతో అసలు తితిదేకి ఈఓ ఉన్నారా.. అని కొంతమంది ప్రశ్నలు కూడా వేసేస్తున్నారు. మరి ఈఓ ఇదే విధంగా ఉంటారా.. లేకుంటే ఇలానే ఉండిపోతారా అన్నది కాలమే సమాధానం చెప్పాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి