భగవతార్చన ఎలా చేయాలి..? దేవునికి కొట్టే గంట ఎక్కడ...? నీటి పాత్ర ఎక్కడ...? ఇంకా...

గురువారం, 23 జూన్ 2016 (13:27 IST)
భగవంతుని నైవేద్యంగా ముద్దగా ఉన్న నేతిని మాత్రమే సమర్పించవలెను. కరిగిన నేతిని నైవేద్యంగా నివేదించకూడదు. అట్లే గంధము కూడా పలుచగా నీటి వలెనున్నది కాక ముద్దగా ఉన్నదానితోనే అర్చించవలెను. పూజా సమయంలో పూజా సామాగ్రిని తగిన స్థానాలలో ఉంచవలెను. దేవునికి ఎడమ వైపు నీటి పాత్ర(కలశం), గంట, ధూపపాత్రను ఉంచవలెను. ఎడమవైపున నూనె దీపము, సువాసిత జలముతో నింపిన శంఖమును ఉంచవలెను. దేవునికి ఎదురుగా హారతికి కావాల్సిన కర్పూరము, కుంకుమాదులను ఉంచవలెను. 
 
పుష్పాలను  భగవంతునికి సమర్పించునపుడు కాడ క్రిందకు వచ్చే విధంగా సమర్పించాలి. దుర్వాల(గరికె) యొక్క ముందు భాగము పూజించు వాని వైపు ఉండే విధంగా పూజించాలి. మారేడు దళాలతో భగవంతుడిని పూజించునప్పుడు దళములు దేవుని వైపు, పూజించు వాని వైపు కాడ వచ్చేలా పూజించాలి. తులసీ మొదలైన పత్రములు పూజ చేయువానికి అభిముఖంగా ఉండవలెను. 
 
ఉంగరము వేలు, మధ్యవేలు, బొటనవేలు కలిపి పువ్వులను తీసి భగవంతుడిని పూజించనలెను. నిర్మాల్యమును బొటనవేలు, చూపుడు వేళ్ళను కలిపి తీయవలెను. పూజకు తెచ్చే పువ్వులను ఎడమ చేతితోనూ, ధరించిన వస్త్రములోను తీసుకొని రాకూడదు. శంఖమును శంఖ పాత్ర యందు మాత్రమే ఉంచవెలను. శంఖం క్రింద ఉంచి చేసిన పూజను భగవంతుడు స్వీకరించడు. అభిషేకము మొదలైన వాటికి కలశం నుండి ఉద్ధరిణతో నీటిని తీసి వాడవలెను తప్ప శంఖమును నీటిలో ముంచరాదు. శంఖము యొక్క వెనుక భాగము తగిలిన జలము అపవిత్రము అగును.

వెబ్దునియా పై చదవండి