అలా భోజనం చేస్తే దరిద్రం, ఇలా చేస్తూ తింటే అత్యుత్తమం

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:36 IST)
భోజనం. భుజించేందుకు పద్ధతులున్నాయి. ఇవి మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఐతే ఇప్పుడు టీవీలు, ఫోన్లు వచ్చే సరికి ఏకంగా మంచాలపైనే కంచాలను పెట్టుకుని తినేస్తున్నారు. ఇలా తినడం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అన్నపూర్ణదేవి స్వరూపమైన ఆహారాన్ని ఎంతో పవిత్రంగా భుజించాలి. ఎలా భూజిస్తే ఎలాంటి ఫలితాలో చూద్దాం.
 
భోజనానికి ఉపక్రమించే ముందు ఆ తర్వాత కాళ్లూ చేతులు శుభ్రంగా కడుక్కుని భోంచేయాలి. అలాగే ముగిసిన తర్వాత కూడా ఇదే ఆచరించాలి. భోజనం చేసేటపుడు తూర్పూ లేదా ఉత్తరం దిక్కు వైపు కూర్చుని చేయడం మంచిది.
 
భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు. సాక్షాత్తూ ఆ భగవంతుడు వచ్చినా లేవరాదన్నది నానుడి. ఎంగిలి చేతితో ఏ పదార్థాని చూపించకూడదు, తాకకూడదు.
 
నిలబడి అన్నం తింటూ వుండేవారు క్రమంగా దరిద్రులు అవుతారు. అలాకాకుండా భోజనం చేస్తూ భగవన్నామ స్మరణ చేయడం వల్ల మేలు కలుగుతుంది. కొందరు అన్నం తింటూ పదార్థాలు బాగాలేదంటూ దూషిస్తుంటారు. అలా చేయకూడదు.
 
కంచాన్ని ఒడిలో పెట్టుకుని భోజనం చేయకూడదు. అలాగే పడుకునే మంచం మీద భోజనం చేయడం మంచిది కాదు. ఐతే ఇది వృద్దులకు, అనారోగ్యవంతులకు వర్తించదు.
 
కొందరు గిన్నెల్లో వున్నదంతా నాకేస్తున్నట్లు ఊడ్చుకుని తినేస్తారు. ఇలా చేయకూడదు. ఒకసారి వండిన పదార్థాలను కొందరు మళ్లీమళ్లీ వేడి చేసి తింటుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే ద్విపాక దోషం వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు