కార్తీక మాసం పరమ పవిత్రం.. దీపదానాలు చేయండి.. ఉసిరి చెట్టు కింద?

శుక్రవారం, 20 అక్టోబరు 2017 (14:30 IST)
కార్తీక మాసం ప్రారంభమైంది. శుక్రవారం (అక్టోబర్ 20) పూట ఈ పవిత్ర మాసం ఆరంభం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామునుంచే పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు ప్రత్యేక పూజలు చేయించడంలో భక్తులు నిమగ్నమయ్యారు. కార్తీక మాసం సర్వమంగళకరం. హరిహరులకు కార్తీకమాసం ఎంతో ప్రీతికరం. 
 
కార్తీక మాసంలో ఏ పనిచేసినా.. మంచి ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ మాసంలో భక్తులు ఉదయాన్నే నదీ స్నానాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి హరిహరులకు పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులను పరమపవిత్రమైన దినాలుగా భావిస్తారు. ఈ మాసం చంద్రుడు పూర్ణుడై కృత్తికా నక్షత్రంలో వుంటాడు. అందుకే ఈ మాసానికి కార్తీకమాసం అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే బ్రహ్మీ ముహూర్తంలో నదీ స్నానం అనంతకోటీ పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. 
 
ఈ మాసానికి సమానమైనది ఏదీ లేదంటారు. కార్తీకంలో దీప దానాలు చేసే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ మాసంలో ఎక్కడ దీపాలు వెలిగించబడి వుంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువైవుంటుంది. అందునా… కార్తీకమాసంలో సోమవారం రోజున ఉసిరి చెట్టుకింద దీపం పెడితే కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున గోదావరి స్నాం చేసి దీపదానం చేసుకుంటే వారికి సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. 
 
ముఖ్యంగా శివుడికి అభిషేకాలు చేయించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అందునా ప్రదోషకాలం అభిషేకానికి ఎంతో విశిష్ఠమైనది. ఈ సమయంలో శివుడు.. పార్వతీదేవి సమేతుడై అర్ధనారీశ్వర రూపంలో తాండవం ఆడుతుంటాడని పురాణోక్తి. అందువల్ల ప్రదోషకాలంలో శివుడిని ఆరాధించడం కనిపిస్తుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు