కృష్ణ భగవానుని నుంచి అది నేర్చుకోవాలి...

గురువారం, 10 మే 2018 (22:24 IST)
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. మనుషులు రకరకాల తరహాలలో ఉంటారు. ఆత్మ యొక్క స్థితిలో, పరిణామ క్రమంలో ఒక్కొక్కరూ ఒక్కో స్థితిలో ఉంటారు. ఎన్నో రకాల స్థితులవారు ఒకటే కుటుంబంలో ఉంటారు. కనుక కుటుంబ సభ్యులలోనే చాలా వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల స్పర్ధలు వస్తాయి, మనశ్శాంతిని కోల్పోతారు. అయితో ఓ యోగికి, ధ్యానికి మాత్రం మనశ్శాంతి పోదు. 
 
అదెలాగంటే... మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు. వీళ్లను నేను చంపాలా... వీళ్లతో నేను కొట్లాడాలా... అని. అయితే కృష్ణుడు మాత్రం చంపేయవోయ్.... అన్నాడు. అదే కుటుంబంలో ఉన్నవాడు కృష్ణుడు. కౌరవులు కృష్ణునికి సోదరులే కానీ చంపేయ్.... అన్నాడు. యుద్ధం వచ్చింది చంపేయాలి అంతే... మనశ్శాంతి కోల్పోలేదు కృష్ణుడు. కానీ అర్జునుడు కకావికలుడై పోయాడు. కింకర్తవ్యత విమూఢుడై పోయాడు. తన గాండీవాన్ని పడేశాడు. 
 
ఇప్పుడు నేనేం చేయాలి. నేను వెళ్లిపోతా.... నేను భిక్షాటన చేసుకుంటా.... అన్నాడు. ఏమి అక్కర్లేదు నీ ధర్మం నీవు చెయ్యి అన్నాడు కృష్ణుడు. నీ ధర్మార్థం కోసం ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు ఆ నువ్వు పోతున్నావు. అర్జునుడు ధ్యాని కాడు. యోగి కాడు. కనుక అతనికి విషాదం వచ్చేసింది. మనశ్శాంతిని కోల్పోయాడు. కృష్ణుడు మనశ్శాంతిని జయించినవాడు. కృష్ణుడికి ఎప్పుడూ మనశ్శాంతే... సుఖమున్నా, దుఃఖమున్నా, మంచి ఉన్నా, చెడు ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, కొట్లాడుతూ ఉన్నా, అందరిని చంపుకుంటూ ఉన్నా కూడానూ అతను ఆ మహాభారత యుద్ధంలో ఆ మహా సంగ్రామంలో చక్కగా నవ్వుతూ మాట్లాడాడు. నవ్వుతూ ప్రభోదించాడు. అతను తన పూర్ణ జీవితంలో నవ్వుతూ జీవించాడు. అతనికి ఎంత మనస్థైర్యం.... ఎంత మనసు యొక్క వికాసం, ఎంత మనశ్శాంతి ఉందో మనం గ్రహించాలి.
 
ఆ విధమైన మనశ్శాంతి మనందరికి కావాలి. కానీ అందరిలో లోపించినదే మనశ్శాంతి. ఆ మనశ్శాంతిని అందరూ పొందాలంటే ధ్యానం తప్పనిసరి. అన్యధా శరణం నాస్తి. ధ్యాన అభ్యాసం ద్వారానే ఆ మనస్సును ఎప్పుడూ శూన్యం చేసుకునే అలవాటు ద్వారానే మనశ్శాంతి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు