శ్రీరామా... ముందుగా నువ్వు నాతో వాదన చెయ్యి... తర్వాత సంసారాన్ని త్యజించు

శనివారం, 25 ఆగస్టు 2018 (21:54 IST)
ఒకసారి ఒక భక్తుడు వచ్చి  శ్రీ రామకృష్ణులు గారిని  స్వామి మనస్సు భగవంతుడి వైపుకు మరలినప్పుడు ఆ వ్యక్తి సంసారంలో జీవించగలడా..... అని ప్రశ్నించాడు. అప్పుడు రామకృష్ణులు సంసారంలో ఉండకపోతే మరి ఎక్కడకు వెళతాడు.... నేను ఎక్కడ ఉన్నా సరే, శ్రీరాముడి అయోధ్యలో ఉన్న అనుభూతిని పొందుతుంటాను. ఈ ప్రపంచమంతా శ్రీరాముడి అయోద్యే. గురువు నుండి ఉపదేశం పొందాక సంసారం త్యజిస్తానన్నాడు శ్రీరాముడు. అతణ్ణి ఆ ప్రయత్నం నుండి విరమింప చేయడానికి దశరధుడు, వశిష్ట మహర్షిని పంపాడు. 
 
రాముడు తీవ్ర వైరాగ్య జనితుడై ఉండటం వశిష్టుడు గమనించాడు. అతడితో ఇలా అన్నాడు. రామా... ముందుగా నువ్వు నాతో వాదన చెయ్యి. కావాలంటే తర్వాత సంసారాన్ని త్యజించు. సంసారం అనేది భగవంతుడి నుండి వేరై ఉందా.. అలా వేరై ఉన్న పక్షంలో నువ్వు దాన్ని త్యజించవచ్చు. భగవంతుడే సమస్త జీవజగత్తులుగా విరాజిల్లుతున్నట్లు రాముడు దర్శించాడు. భగవంతుడి అస్థిత్వం కారణంగానే సమస్తము వాస్తవంగా గోచరిస్తుంది.  అందుచేత రాముడు మౌనం వహించాడు.
 
ఈ ప్రపంచంలో కామక్రోధాదులతో పోరు సలపవలసి ఉంటుంది. పలురకాల కోర్కెలతో, ఆసక్తితో యుద్ధం చేయవలసి ఉంటుంది. కోటలోనే ఉంటూ, అంటే ఇంట్లోనే ఉంటూ యుద్ధం చేయడం అనుకూలం. ఇంట్లో తినడానికి తిండి దొరుకుతుంది. ధర్మపత్ని పలువిధాలుగా సహాయం చేస్తుంది. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. అన్నం కోసం ఏడు ఇళ్ల తలుపులను తట్టడం కంటే ఒకేచోట ఉండి పుచ్చుకోవటం మేలు. ఇంట్లో జీవించటం కోటలో ఉండి యుద్ధం చేయటం లాంటిది. 
 
తుపాను గాలికి ఎగురుతూ ఉన్న ఎంగిలి విస్తరాకులా సంసారంలో వసించు. తుపాను గాలికి ఆ ఆకు ఒక్కోసారి ఇంటి లోపలికి పోతుంది. మరోసారి చెత్తకుప్పపై పడుతుంది. గాలి ఎటువైపు వీస్తే ఆకు కూడా అటు వైపే కొట్టుకుపోతుంది. ఒక్కోసారి మంచి చోటుకు, ఒక్కోసారి అపరిశుభ్రమైన చోటుకు పోతుంది. భగవంతుడు ప్రస్తుతం నిన్ను సంసారంలో ఉంచాడు. అది మంచిదే. ఇప్పుడు నువ్వు అదే చోట ఉండు. తరువాత నిన్ను ఆ చోటు నుండి లేవదీసి అంతకంటే మంచి ప్రదేశంలో నిలిపినప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది అని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు