తిరుమలలో పువ్వులన్నీ శ్రీనివాసునికే.. భక్తులెవ్వరూ పుష్పాలు పెట్టుకోకూడదు.. ఎందుకు?

శుక్రవారం, 4 ఆగస్టు 2017 (13:02 IST)
కలియుగ వైకుంఠం, తిరుమల ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. అందుకే వెంకన్న అలంకారం కోసం నిత్యం 25 రకాల పుష్పాలు వినియోగిస్తారు. శ్రీవారికి రోజూ రెండుసార్లు తోమాల సేవ జరుగుతుంది. ఇంకా ఆనంద నిలయంలో స్వయంభువుగా కొలువుదీరిన సాలగ్రామ శిలామూర్తికి పుష్పప్రియుడనే మరో నామం ఉంది. అందుకే తిరుమలలో పువ్వులన్నీ శ్రీవారికేనని.. భక్తులెవ్వరూ పుష్పాలు పెట్టుకోకూడదనే సంప్రదాయం అనాదిగా ఆచరణలో ఉంది. 
 
లక్ష్మీవల్లభుడైన వెంకన్నను నిత్య అలంకారప్రియుడుగా అన్నమయ్య తన సంకీర్తనలో వర్ణించారు. శ్రీవారికి నిత్యం, పర్వదినాల్లో కలిపి దాదాపు 190కి మించిన టన్నుల వరకు పుష్పాల వినియోగం జరుగుతోంది. పువ్వుల్ని ఆకర్షణీయ మాలలుగా కట్టడానికి కూలీలు నిత్యం శ్రమిస్తుంటారు. వీరికి శ్రీవారి సేవకులు కూడా సహకారం అందిస్తుంటారు. రోజుకు రెండు సార్లు స్వామికి తోమాల సేవ నిర్వహించి పుష్పకైంకర్యం చేస్తారు. కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్‌సేవకు విరివిగా పుష్పాలు వినియోగించి ఉత్సవమూర్తులకు ప్రత్యేక శోభను తీసుకువస్తున్నారు.
 
మూల విరాట్టు శిరస్సు భాగం నుంచి శంఖు చక్రాల వరకు తొమ్మిది అడుగుల మాలను ధరిస్తారు. ఆనందనిలయంలో స్థిరంగా నిలిచిన శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్య కల్యాణం, వసంతోత్సవానికి తులసి ఆకులతో మాలలు వేస్తారు. అలాగే శ్రీవారికి తులసి, గులాబీలు, గన్నేరి, తీగ సంపంగి,  చీమ దవణం, నంది, సంపంగి, మొగిలి, మల్లెలు, కనకాంబరం, చామంతి, ముల్లెలు, మరువం, కురివేరు, వట్టివేరు, మానస సంపంగి, రోజా, తామరపూలు, మొగిలిరేకులు, బిల్వఆకు, పన్నీరు ఆకు, దవనం వంటివి ఉపయోగిస్తారు.

వెబ్దునియా పై చదవండి