కాగితపు మంటతో చెవిపై కాలిస్తే పసికర్లు పోతాయ్...

నయంకాని మొండి జబ్బుల విషయంలో ప్రజలు దేవునిపైనే భారం వేస్తారు. ఈ జబ్బులు నయమయ్యేందుకు వివిధ రకాలైన చికిత్సా పద్ధతులను సైతం అనుసరిస్తుంటారు. ఏది నిజం శీర్షికలో భాగంగా ఈసారి మీకు ఓ విభిన్నమైన చికిత్సా పద్ధతి గురించి తెలియజేయబోతున్నాం. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన పసికర్లను తగ్గించగలనని చెపుతున్న వైద్యుని వద్దకు మిమ్మల్ని తీసుకెళుతున్నాం.

పసికర్ల వ్యాధితో బాధపడుతున్న రోగులు మేం వెళ్లేసరికి అక్కడ బారులు తీరి కనిపించారు. సహజంగా పేరుమోసిన వైద్యాలయాల ముంగిట రోగులు పడిగాపులుకాయటం చూస్తాం. కానీ ఇక్కడ మంజీత్ పాల్ సలూజా అనే వ్యక్తికోసం అతని షాపు ముందు పసికర్లు వ్యాధి సోకిన రోగులు క్యూలో నిలబడి ఉన్నారు.

తన నైపుణ్యంతో పసికర్ల వ్యాధిని తగ్గిస్తానని చెప్పే మంజీత్ రానే వచ్చాడు. ఓ రోగికి చికిత్సను చేయడం ప్రారంభించాడు. చికిత్సలో భాగంగా అతను రోగి చెవి దగ్గర ముక్కోణాకృతిలో ఉన్న పేపరను ఉంచి మరో వైపున ఉన్న చివరకు కొవ్వొత్తితో నిప్పంటించాడు. ఇదే పద్ధతిని ప్రతి రోగి విషయంలోనూ అనుసరిస్తానని చెప్పాడు. మరో విషయం ఏమిటంటే... అతను చికిత్సకు ఉపక్రమించే ముందు గణేశుని ప్రార్థించడం ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోడు.
WD


చెవి దగ్గర మండిన పేపరును బయటకు తీసిన తర్వాత, రోగి చెవి చుట్టూ పసుపు వర్ణంలో ఉన్న ఒకరకమైన పదార్థం కనబడింది. ఆ పదార్థం వల్లనే పసికర్ల వ్యాధి వచ్చిందనీ, తాను చేసిన చికిత్సవల్ల రోగ కారకమైన పదార్థం వెలుపలికి వచ్చిందని చెప్పాడు మంజీత్.

అయితే చికిత్స నిమిత్తమై ఇక్కడకు వచ్చే రోగులు పూలదండ, అగరొత్తులు, కొబ్బరికాయలను తప్పకుండా తీసుకురావాలి. వీటికి మించి ఏవైనా కానుకలు సమర్పించాలనుకునే వారికి స్వాగతం పలుకుతాడు మంజీత్. అయితే రోగులకు తాను ఉచితంగా చికిత్స చేస్తున్నానంటాడు మంజీత్. తనపై ఉన్న భక్తికొద్దీ రోగులు తనకు కానుకలను సమర్పిస్తున్నారంటాడు. ఇక్కడకు వచ్చే రోగులందరూ మంజీర్ చికిత్సను నమ్ముతున్నారు. అంతేకాదు అతను చేసే చికిత్సకు అనుగుణంగా మంజీత్ అనుసరించమని చెప్పే మార్గాలన్నిటినీ వారు తప్పక పాటిస్తారు.

WD
వంశపారంపర్యంగా ఈ వైద్యం తనకు సంక్రమించిదని చెపుతాడు మంజీత్. తమ కుటుంబానికి భగవంతుడిచ్చిన బహుమతే ఈ వైద్యం అంటాడు. తన తండ్రి, తాత అందరూ ఈ వినూత్న చికిత్సను చేసి ఎందరో ప్రాణాలను కాపాడారని చెపుతున్నాడు. చికిత్సలో భాగంగా అతను హోమియో మరియు ఆయుర్వేద మందుల మిశ్రమాన్ని చుక్కల మందు రూపంలో ఇస్తాడు.

రోజుకి కనీసం 80 నుంచి 90 మంది రోగులకు మంజీత్ చికిత్స చేస్తాడు. రోగిని చూసినంతనే ఆ రోగికున్న జబ్బు ఏమిటో.. అతనికి అవసరమైన మందు ఏమిటో, జబ్బు నయమయ్యేందుకు పట్టే సమయం ఎంతో చెప్పగలనంటున్నాడు.

పసికర్లతో బాధపడే రోగులు చాలామంది తన వద్దకు వస్తారనీ, వారిలో వైద్యులు సిపార్సు మేరకు వచ్చేవారు సైతం ఉంటారని చెపుతున్నాడు మంజీత్. మరో విశేషం ఏమిటంటే... తమ కుటుంబంలోని వ్యక్తులెవరైనా పసికర్లతో బాధపడుతున్నట్లయితే వైద్యులే వారిని వెంటబెట్టకుని మంజిత్ వద్దకు చికిత్సకై వస్తుండటం. ఇటువంటి వైద్యం కేవలం చిట్కా వైద్యమా...? లేదంటే శాస్త్రీయతతో కూడిన ప్రక్రియా...? మీరేం ఆలోచిస్తున్నారు...? దయచేసి మాకు తెలియజేయండి.