ఇండోర్ దత్తాత్రేయుని వైభవం

తీర్థయాత్రలో భాగంగా ఈసారి మిమ్ములను మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో కొలువై ఉన్న దత్తాత్రేయుని ఆలయానికి తీసుకెళుతున్నాం. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంగా పరిగణిస్తారు. దత్తాత్రేయునికి శ్రీ గురుదేవ దత్తా అని మరో పేరు కూడా ఉంది.

ఇక్కడ నెలకొన్న దత్తాత్రేయుని ఆలయం 700 సంవత్సరాలనాటిదని చెపుతారు. ఇండోర్ కేంద్రంగా చేసుకుని పరిపాలించిన హోల్కార్ రాజుల కాలానికి ముందే ఈ ఆలయం ఉన్నట్లు చరిత్ర చెపుతోంది. ప్రతి 12 ఏళ్లకోసారి ఉజ్జెయినీలో నిర్వహించే సింహష్ట చెప్పే వివరాల ప్రకారం సాధులు, యోగులు ఈ ఆలయం వద్ద విశ్రమించడానికి ఇష్టపడేవారట.

ఆది శంకరాచార్యులువారు సైతం తన శిష్య బృందంతో కలిసి ఆలయానికి వేంచేసినట్లు చరిత్ర చెపుతోంది. ఆయన ఉజ్జెయినీలోని మహాకాలేశ్వర్, అవంతిక ప్రాంతాల సందర్శనకు వచ్చిప్పుడ దత్తాత్రేయుని ఆలయంలో విశ్రమించడానికే మొగ్గు చూపేవారట.

మధ్య భారతంలో తన బోధనలను విస్తరింపజేయడానికి వేంచేసిన గురునానక్ మూడు నెలలపాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే ఇమాలి సాహిబ్ గురుద్వారాలో బస చేశారు. ఆయన బస చేసిన రోజుల్లో ఆధ్యాత్మిక బోధనలకు, చర్చలకై తన శిష్యులతో సహా దత్తాత్రేయుని ఆలయానికి సమీపంలోగల నది ఒడ్డుకు వెళ్లేవారట.

దత్తాత్రేయుని అవతారం ఓ అధ్భుతమని చెపుతారు. ప్రతి ఏటా మార్గశిర పూర్ణమినాడు దత్త జయంతి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దత్తాత్రేయుని వైభవాన్ని తెలుపుతూ అనేక పుస్తకాలు వెలువడ్డాయి. అందులో గురుచరిత్ర అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇందులో మొత్తం 52 అధ్యాయాలుండగా, వాటిలో దత్తాత్రేయుని కీర్తిస్తూ సుమారు 7వేల 491 పదాలున్నాయి.
WD


దత్త గురు విగ్రహంతోపాటు ఓ కాకి, నాలుగు కుక్కలు మనకు దర్శనమిస్తాయి. దీనికి కారణం ఉంది. భూమిని, నాలుగు వేదాలను కాపాడేందుకు దత్తాత్రేయుడు అవతారమెత్తాడని పురాణాలు చెపుతున్నాయి. ఇక దత్తాత్రేయుని ప్రక్కనే ఉండే కాకి భూమికి ప్రతీక అనీ, నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు చిహ్నాలని చెప్పబడ్డాయి.

త్రిమూర్తల అవతారమైన దత్తాత్రేయుని కీర్తి నలుదిశలా వ్యాపించి ఉంది. శైవులు, వైష్ణవులు అనే బేధం లేకుండా అందరూ దత్తాత్రేయుని కీర్తిస్తారు. దత్తాత్రేయునికి ప్రధాన భక్తులలో ముస్లిం మతానికి చెందినవారు కూడా ఉండటం మరో విశేషం.

ఎలా వెళ్లాలి-

విమాన మార్గం- విమాన మార్గం ద్వారా ప్రయాణించి, దత్తాత్రేయుని దీవెనలందుకోవాలనుకునేవారికి ఇండోర్‌లోని అహిల్యాభాయ్ ఎయిర్ పోర్ట్ అతి దగ్గర విమానాశ్రయం.
రైలు ద్వారా... ఇండోర్ రైల్వే స్టేషను అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. కనుక రైలు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవడం సులభమే.
రోడ్డు ద్వారా... ఆగ్రా- ముంబై జాతీయరహదారికి అనుసంధానించబడి ఉంది. ఇక్కడ నుంచి ఆటో లేదా ఏదేని ప్రైవేటు వాహనంలో మీరు దత్తాత్రేయుని ఆలయానికి చేరుకోవచ్చు.