శ్రీ హర్మందిర్ సాహిబ్, శ్రీ దర్బార్ సాహిబ్ లేదా స్వర్ణదేవాలయం (దేవాలయ సౌందర్యం మరియు బంగారు పూతను దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల భాషలో మాట్లాడే ప్రజలు పిలుచుకునే పేరు)గా పిలవబడే ఈ దేవాలయం, దేవాలయపు దేవుడు హరి (దైవం) పేరిట నామకరణం గావించబడింది. ప్రపంచంలోని సిక్కులందరూ, ప్రతి రోజూ శ్రీ అమృత్సర్ను సందర్శించి శ్రీ హర్మందిర్ సాహిబ్కు పూజలు చేయాలని మనసావాచాకర్మణా ఆకాంక్షిస్తుంటారు.
సిక్కులు ప్రార్ధనలు జరిపేందుకు అవసరమైన ఒక కేంద్రాన్ని నెలకొల్పాలనే తలంపు ఐదవ సిక్కు గురువైన గురు అర్జున్ సాహిబ్ మనోఫలకంలో మెదిలింది. తలచిందే తడువుగా స్వంతంగా శ్రీ హర్మందిర్ సాహిబ్ దేవాలయ నిర్మాణ ప్రణాళికను, భవన ఆకృతిని ఆయన స్వంతంగా రూపొందించారు. ప్రారంభంలోనే పవిత్ర సరోవరాన్ని (అమృత్సర్ లేదా అమృత్సర్ అనగా అమృత కొలను) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మూడవ సిక్కు గురువు అమర్దాస్ సాహిబ్ తిరస్కరించారు.
WD
కానీ బాబా బుద్ధజీ పర్యవేక్షణలో గురు రామదాస్ సాహిబ్ సమ్మతితో పవిత్ర సరోవరం రూపుదిద్దుకుంది. చెల్లింపుల ద్వారా స్థానిక గ్రామాల భూస్వాముల నుంచి సేకరించిన విరాళాలతో తొట్టతొలి గురు సాహిబ్లు, ప్రార్ధన కేంద్రానికి అవసరమైన భూమిని సముపార్జించారు. పట్టణ రూపకల్పనకు సైతం ప్రణాళిక రూపొందిచబడింది. తదనుగుణంగా, క్రీ.శ 1570 సంవత్సరంలో అమృతసరోవరం మరియు పట్టణ నిర్మాణ కార్యక్రమం ఏకకాలంలో ప్రారంభమయ్యింది. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు క్రీ.శ 1577నాటికి పూర్తయ్యాయి.
WD
ముస్లీం సాధువు హజ్రత్ మియా మిర్జీ చే 1588 సంవత్సరం డిసెంబర్ మాసంలో గురు అర్జున్ సాహిబ్ కట్టడానికి శంకుస్థాపనను చేయించారు. గురు అర్జున్ సాహిబ్ స్వీయ పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరిగాయి. ఆయనకు సహాయకులుగా ప్రముఖులైన సిక్కులు బాబా బుద్ధజీ, భాయ్ గురుదాస్జీ, భాయ్ సాహ్లోజీ మరియు అనేక సిక్కు భక్తులు వ్యవహరించారు.
సాధారణంగా హిందూ దేవాలయ వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణాలు నేల మట్టానికి అధిక ఎత్తులో నిర్మించబడతాయి. అందుకు విరుద్ధంగా గురు అర్జున్ సాహిబ్ ఈ నిర్మాణాన్ని తక్కువ ఎత్తులో నిర్మించారు. అలాగే హిందు దేవాలయాల ప్రవేశానికి, వెలుపలకు రావడానికి ఒకే ద్వారం ఉంటుంది. కానీ గురు సాహిబ్ ఈ కట్టడానికి నాలుగు వైపులా ద్వారాలను నిర్మించారు. తదనుగుణంగా గురు సాహిబ్ కొత్తగా సిక్కు మత సృష్టికి నాంది పలికారు. అంతేకాక జాతి, మత, లింగ వివక్ష లేకుండా అందరూ దేవాలయ ప్రవేశానికి అర్హత పొందే అవకాశాన్ని గురు సాహిబ్ కల్పించారు.
కట్టడ నిర్మాణం క్రీ.శ 1601 ఏడాది పూర్తయింది. కొత్తగా సృష్టించబడిన ఆది గ్రంథ్ సాహిబ్ (అనంతర కాలంలో గురుగ్రంథ సాహిబ్)ను శ్రీ హర్మందిర్ సాహిబ్లో గురు అర్జున్ సాహిబ్ వ్యవస్థీకరించారు. అంతేకాక ఆది గ్రంథ్ సాహిబ్ను తొలిసారిగా పారాయణం చేసే గ్రంథీగా బాబా బుద్థజీని నియమించారు. ఈ సంఘటన అనంతరం 'అఠ్ సఠ్ తీర్థ్' స్థాయిని అది పొందింది. సిక్కులకు తమ కోసం ప్రత్యేకించిన స్వంత పుణ్యక్షేత్రం లభించింది.
WD
సరోవరానికి మధ్య భాగంలో గల 67 చ.అడుగుల వేదికపై శ్రీ హర్మంది సాహిబ్ నిర్మితమైంది. వేదికపై 40.5 చ.అడుగుల విస్తీర్ణంలో దేవాలయం కొలువై ఉంది. దేవాలయానికి నాలుగు దిక్కులా ద్వారాలు ఉన్నాయి. ద్వారాలపై భాగాన్ని అద్భుతమైన కళాదృష్టితో అలంకరించారు. ప్రధాన భవనమైన శ్రీ హర్మందిర్ సాహిబ్కు దారి తీసే వంతెనకు వెళ్ళే విధంగా అది నిర్మితమైంది. అది 202 అడుగుల పొడవును 21 అడుగుల వెడల్పును కలిగి ఉంది.
WD
వంతెన 13 అడుగుల వెడల్పు కలిగిన 'ప్రదక్షిణ' (వృత్తాకారపు మార్గం)తో కలుపబడి ఉంది. ప్రధాన దైవ మందిరానికి ఆవృతంగా సాగుతూ అది 'హరి కీ పౌడీ' (దేవుని యొక్క మెట్లు)కి దారి తీస్తుంది. 'హరి కీ పౌడీ' మొదటి అంతస్తులో గురు గ్రంథ్ సాహిబ్ నిత్య పారాయణం జరుగుతుంటుంది. శ్రీ హర్మందిర్ సాహిబ్ ప్రధాన కట్టడం నిర్వాహణపరంగానే కాక సాంకేతికంగా మూడంతస్తుల నిర్మాణం. వంతెనకు అభిముఖంగా గల నిర్మాణంలో పునరావృతమైన దంతాగ్ర ఆర్చిలు మరియు మొదటి అంతస్తు యొక్క పై కప్పు 26 అడుగుల 9 అంగుళాల ఎత్తున నిర్మితమైంది.
మొదటి అంతస్తు పై భాగంలో నాలుగు అడుగుల ఎత్తు గల పిట్టగోడ అన్ని వైపులా నిర్మించబడనదై నాలుగు మూలల యందు నాలుగు 'మమ్టీల'తో ప్రధాన మందిరం యొక్క కేంద్రీయ హాలుపై భాగంలో మూడవ అంతస్తుకు ఆసరా ఇస్తున్నది. అది మూడు ద్వారాలను కలిగిన చిన్న చతురుస్రపు గది. గురు గ్రంథ్ సాహిబ్ నిత్య పారాయణం ఇక్కడే జరుగుతుంటుంది.
WD
ప్రపంచంలోనే అద్భుతమైన భవన నిర్మాణ శైలికి నమునాగా పేరొందినదై తన యొక్క నిర్మాణ పనులలో హిందూ ముస్లీంల సమైక్యతకు అద్దం పడుతున్నది. భారతీయ కళా చరిత్రలో తనదైన స్వయంప్రతిపత్తి కలిగిన సిక్కు భవన నిర్మాణ శాస్త్ర పాఠశాల సృష్టికి ఈ భవన నిర్మాణం దోహదం చేసిందని ప్రస్తావించబడింది.
చేరుకునే మార్గం: రైలు, రోడ్డు మరియు విమాన మార్గాల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు అమృత్సర్ అనుసంధానించబడింది.