షిర్డీ సాయిబాబాకు రూ.28లక్షల బంగారు కిరీటం.. ఇటలీ మహిళ కానుక

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (12:01 IST)
ఇటలీ దేశానికి చెందిన ఓ మహిళ రూ.28లక్షల విలువైన బంగారు కిరీటాన్ని షిర్డీ సాయిబాబాకు బహూకరించారు. శీలిని డోలోరాస్ అలియాస్ సాయి దుర్గా అనే 72 ఏళ్ల ఇటాలియన్ మహిళా భక్తురాలు 855 గ్రాముల బరువు ఉన్న రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకు బహూకరించారు.  సాయిబాబా భక్తురాలైన ఈమె.. గత తొమ్మిదేళ్లుగా ప్రతి నెలా షిర్డీని సందర్శించుకుంటున్నారు. 
 
గతంలో సాయి దుర్గా బంగారంతో తయారు చేసిన రుద్రాక్ష మాలను రూ.25లక్షలతో చేయించి దేవుడికి సమర్పించుకున్నారు. తాజాగా రూ.28లక్షల విలువైన కిరీటాన్ని స్వామివారికి కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటలీ దేశంలో సాయిబాబా దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. తమ దేశంలో నిర్మిస్తున్న దేవాలయంలో ప్రతిష్ఠించేందుకు సిద్ధం చేసిన సాయి ప్రతిమను షిర్డీ సాయి సన్నిధిలో పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని ఇటలీలోని సాయి భక్తురాలు వివరించారు.

వెబ్దునియా పై చదవండి