నో టిక్కెట్స్, రిలీజ్ చేసిన కాసేపటికే శ్రీవారి టిక్కెట్లు హాంఫట్

మంగళవారం, 20 జులై 2021 (16:13 IST)
కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్‌ను పూర్తిగా తీసేయడం.. ఆంక్షలు ఎక్కడా పెద్దగా లేకపోవడంతో జనం రోడ్లపై ఇష్టానుసారం కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆలయాలకు భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతోంది. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల సందడి ఎక్కువగా కనబడుతోంది.
 
ఇక తిరుమల అంటారా.. కలియుగ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతోంది. ఎపిలో లాక్ డౌన్ సడలించడం.. తమిళనాడు రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ లేకపోవడంతో భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతోంది. సాధారణంగా తమిళనాడు రాష్ట్రం నుంచే తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు వస్తుంటారు. 
 
కరోనా రెండు వేవ్‌ల కారణంగా రద్దీ తిరుమలలో బాగా తగ్గింది. అంతేకాదు తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా కౌంటర్ల నుంచి ఇచ్చే టోకెన్లను నిలిపివేయడంతో భక్తుల రద్దీ మరింత తగ్గింది. ఆన్లైన్‌లో మాత్రమే దర్సన టిక్కెట్లను ఇచ్చేవారు. 
 
అయితే ఆన్ లైన్ దర్సన టిక్కెట్లను పొందినా కూడా భక్తులు మాత్రం రావడం లేదు. దీంతో గత 15 రోజుల ముందు వరకు తిరుమలలో రద్దీ పెద్దగా కనిపించలేదు. కానీ రెండు, మూడురోజుల నుంచి మాత్రం భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతోందని టిటిడి అధికారులు చెపుతున్నారు.
 
ఈ నేపథ్యంలో తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఉన్న విభాగం ఆగష్టు నెలకు సంబంధించి దర్సన టోకెన్లను విడుదల చేసింది టిటిడి. ప్రతిరోజు 5 వేల టోకెన్లను విడుదల చేసింది. అయితే ఆన్ లైన్లో టోకెన్లను విడుదల చేసిన వెంటనే భక్తులు అధికసంఖ్యలో టోకెన్లను పొందారు.
 
సరిగ్గా మూడు గంటల్లోనే టోకెన్లన్నీ ఖాళీ అయిపోయాయి. టోకెన్ల కోసం వెతుకున్న వారి సంఖ్య ఎక్కువగా కనబడుతోందట. అయితే టిటిడి ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత టోకెన్లను పెంచే ఆలోచన ఉండదు. సామాన్యులే కాదు విఐపిల తాకిడి కూడా ఎక్కువగా తిరుమలలో కనిపిస్తోంది. ఇక సాధారణ స్థితికి తిరుమల వస్తోందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు