తితిదే కళ్యాణకట్ట కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేలు - తితిదే ఛైర్మన్‌ వెల్లడి

మంగళవారం, 14 జూన్ 2016 (17:08 IST)
ఎట్టకేలకు తితిదే కళ్యాణకట్ట కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేలును ప్రకటిస్తూ తితిదే పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తితిదే పాలకమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, తితిదే ఈఓ సాంబశివరావు అధ్యక్షతన పాలకమండలి సమావేశం మంగళవారం జరిగింది. సమావేశ నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు.
 
బర్డ్ ఆసుపత్రిలో తితిదే నిధులతో 4 కోట్ల 22 లక్షల రూపాయలు వెచ్చించి ఆరు ఆపరేషన్‌ థియేటర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక్క ఏప్రిల్‌లోనే తలనీలాల ఆదాయం 5 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చినట్లు తెలిపారు. అలాగే బెంగుళూరుకు చెందిన బాబూ లోకనాథం, జయశ్రీ అనే భార్యాభర్తలు అపార్టుమెంట్‌ను తితిదే పేరు మీద రాయడానికి సిద్ధమయ్యారని, రిజిస్ట్రేషన్‌ ఖర్చులను తితిదేనే భరించి భవనాన్ని విరాళంగా తీసుకుంటుందన్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం చదలవాడ తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభస్వామి ఆలయ నిర్మాణానికి రూ.25 లక్షలు, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని వల్లభ నారాయణస్వామి ఆలయానికి రూ.31 లక్షలు, తిరుపతిలోని అలిపిరి నమూనా ఆలయ సమీపంలో ఎస్వీబీసీ ఛానల్ నిర్మాణానికి 14 కోట్ల 40 లక్షల రూపాయలు, ప్రకాశం జిల్లా కొండేపిలో కళ్యాణ మండపం నిర్మాణానికి కోటి 20 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
 
తితిదే డ్రైవర్లకు రాత్రి మజిలీ భత్యంను పెంచుతున్నట్లు చెప్పారు. ఆరునెలల కాల పరిమితిగాను 3.75 కిలోల జీడిపప్పుకు రూ.25 కోట్లు, కిలో రూ.39.50 రూపాయలు చొప్పున ఏపీ నుంచి రూ.9.18 లక్షల కిలోలు, తెలంగాణ నుంచి రూ.6.12 లక్షల కిలోలు బియ్యం కొనుగోలు కోసం రూ.7.97 కోట్ల వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రూ.4.40 లక్షల కిలోల బియ్యం కొనుగోలు రూ.1.64 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. 
 
అలాగే, రూ.70 లక్షల ఎస్‌.ఎస్‌.బ్లేడ్ల కొనుగోలు రూ.1.61 కోట్లు, మూడు నెలల కాలపరిమితిగాను 33 వేల కిలోల మినప పప్పుకు రూ.56 లక్షల మంజూరు, రూ.1.25 లక్షల కాటన్‌ బ్రౌజ్‌ల కొనుగోలు, రూ.36 వేల కిలోల యాలకులు రూ.3.99 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పౌర సరఫరాల విభాగంలో వెంకటరత్నంను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ఛైర్మన్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి