ఆధార్‌తో రండి.. స్వామివారిని దర్శించుకోండి : తితిదే

గురువారం, 26 ఏప్రియల్ 2018 (10:51 IST)
కలియుగవైకుంఠంలో వెలసివున్న శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సలుభతరమైన విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా, ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డుతో వచ్చే భక్తులకు కేవలం రెండు మూడు గంటల్లోనే స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంది.
 
సాధారణంగా ఎన్నో వ్యయ ప్రయాసలతో తిరుమల గిరులకు చేరుకుని శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలంపాటు దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూసే అవసరం ఇక ఉండదు. తితిదే ముందు ప్రకటించినట్టుగా సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానం గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. దీని ప్రకారం ఓ భక్తుడు క్యూ కాంప్లెక్స్ లోపలికి ఎన్ని గంటలకు రావాలన్న విషయాన్ని ముద్రిస్తూ, అధికారులు బయో మెట్రిక్ కూపన్ అందిస్తారు. దీన్ని తీసుకుని ఆ సమయానికి లోనికి వెళితే రెండు నుంచి మూడు గంటల్లోపే స్వామిని దర్శించుకుని బయటకు రావచ్చు.
 
ఈ కూపన్ కోసం ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి చేసింది. ఈ యేడాది ఆరంభంలో సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన తితిదే... భక్తుల అభిప్రాయాలను కోరిన వేళ, ఈ పద్ధతి బాగుందన్న సమాధానం వచ్చింది. ఆపై మరింత పకడబ్బందీగా ఈ విధానాన్ని తయారు చేసి, అధునాతన కంప్యూటర్ల సాయంతో, 100కు పైగా టైమ్ స్లాట్ కేటాయింపు కేంద్రాలను తిరుమల, తిరుపతిలలోని పలు ప్రాంతాల్లో ఎంపిక చేశారు. ఈ విధానాన్ని మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు