తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. భక్తులకు అల్పాహారం

బుధవారం, 4 మే 2016 (12:56 IST)
తిరుమల తిరుపతి క్షేత్రం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం నుంచి తిరుమల క్షేత్రం భక్తులతో రద్దీగా ఉంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శనం 6 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి శ్రీవారి దర్శన సమయం 4 గంటలు పడుతోంది. మంగళవారం శ్రీవారిని 72,087 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.86 లక్షల లభించింది. 
 
తిరుమల శ్రీవారి భక్తులకు అల్పాహారాన్ని అందించే కార్యక్రమాన్ని తితిదే ఈఓ సాంబశివరావు ప్రారంభించారు. ఇప్పటి వరకు అన్నప్రసాదాన్ని మాత్రమే భక్తులకు అందిస్తోంది. అయితే వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం అల్పాహారాన్ని ఈవో సాంబశివరావు ప్రారంభించారు. తిరుమలలోని అన్నదాన సముదాయంలో ఈఓ అల్పాహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటల వరకు అల్పాహారంను భక్తులకు అందించనున్నారు. అన్న ప్రసాదాన్ని మాత్రం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగించనున్నారు.

వెబ్దునియా పై చదవండి