ఆ ఐదు రోజులు భక్తులకు శ్రీవారి దర్శనం లేనట్టేనా...?

గురువారం, 5 జులై 2018 (09:30 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర దర్శనం పూర్తిగా రద్దు కానుంది. మహా సంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు నెల 12వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు వెంకన్న దర్శనం భక్తులకు కలుగదని తితిదే అధికారులు తెలిపారు. పుష్కరానికి  ఓసారి జరిగే అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ.. ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది. చివరిగా 2006లో ఈ క్రతువు జరిగింది. 
 
ఇందులో భాగంగా వైఖానస ఆగమ నిబంధనల మేరకు గర్భాలయం, ఆనందనిలయం చుట్టూ పలు కార్యక్రమాలు జరుగుతాయి. గర్భగుడిలో మరమ్మతులను మాత్రం స్వయంగా అర్చకులే చేస్తారు. అయితే, గతంలో ఆలయాన్ని గంటల తరబడి మూసివేసినా, పరిమిత సమయం పాటు భక్తులకు దర్శనాన్ని కల్పించేవారు. కానీ ఈ ఏడాది మాత్రం అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ సెలవుల్లో రావడంతో, భారీగా భక్తులు వస్తే వారు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో దర్శనాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది.
 
ఇందులో భాగంగా దర్శనాన్ని రద్దు చేసింది. ఇప్పటికే ఆ ఐదు రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, ఆర్జిత సేవా టికెట్లనూ టీటీడీ జారీ చేయలేదు. స్వామి దర్శనం పూర్తిగా నిలిపివేయాలన్న విషయమై తుది నిర్ణయాన్ని 24వ తేదీన జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తితిదే తెలిపారు.
 
మరోవైపు కానుకల లెక్కింపు సమయాన్ని కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాకుండా, ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. ఈ షెడ్యూల్‌ను జూలై 20 నుంచి ప్రారంభించనున్నట్లు తితిదే నిర్ణయించుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు