శ్రీవారి దర్శనానికి ఆంక్షలు ఎత్తివేత - 2 లక్షల ఆన్‌లైన్ టిక్కెట్లు రిలీజ్

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (21:15 IST)
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం పలు ఆంక్షలను తితిదే బోర్డు విధించింది. ఇపుడు ఈ ఆంక్షలన్నింటిని ఎత్తివేసింది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, వృద్ధులను దర్శనానికి అనుమతించలేదు. తాజాగా శ్రీవారి దర్శనం విషయంలో నిబంధనలు ఎత్తివేసింది. 
 
పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల లోపు పైబడిన వారికి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో దర్శనం చేసుకోవచ్చని వివరించింది. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్ల సౌకర్యంలేదని స్పష్టం చేసింది.
 
కాగా, ఈ నెలాఖరులో వైకుంఠ ఏకాదశి పర్వదినం రానుంది. దీన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం 2 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించనుంది. ఇందుకోసం 2 లక్షల ఆన్‌లైన్ టిక్కెట్లను రిలీజ్ చేసింది. 
 
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 2 లక్షల మంది భక్తులకు ఆన్‌లైన్ టికెట్లను విక్రయించడం ద్వారా, పది రోజుల వ్యవధిలో వారందరికీ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 
 
ఇందుకోసం ఆన్‌లైన్‌లో రోజుకు 20 వేల టికెట్లను విడుదల చేసింది. రోజుకు 20 వేల టికెట్లను భక్తులకు విక్రయిస్తామని, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్న మీదటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరచివుంచాలన్న నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. 
 
నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25వ తేదీన రానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు