ఆ బస్సెక్కితే గంటన్నరలో శ్రీవారి దర్శనం.. ఎలా?

బుధవారం, 13 జూన్ 2018 (12:21 IST)
సాధారణంగా తిరుమల శ్రీవారి స్వామి దర్శనం అంటే గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిందే. ముఖ్యంగా వేసవిలో అయితే ఈ పరిస్థితి మరింత వర్ణనాతీతం. కేవలం దర్శన భాగ్యమే కాదు.. చివరకు గదులు కూడా దొరకడం గగనమే.
 
దీన్ని దృష్టిలో ఉంచుకుని, భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలతో ప్రత్యేక బసులను నడుపుతోంది. చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాల రాజధానుల నుంచి ఈ తరహా బసులు నడుస్తున్నాయి. ఇపుడు కొత్తగా, సముద్రతీర నగరం వైజాగ్ నుంచి కూడా ఈ బస్సులను నడిపేందుకు ఏపీటీడీసీ ఏర్పాట్లు చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తిరుమలలో దర్శనానికి అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ బస్సుల్లో తిరుమలకు వెళితే రద్దీతో పనిలేకుండా గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే వేంకటేశ్వరుని దర్శనం చేయించే సదుపాయం కల్పించనుంది. చాలాకాలం కిందటే రూపొందించిన ప్రతిపాదనలను ఈనెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని భావిస్తున్నారు. 
 
విశాఖ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు వొల్వో బస్సు బయలుదేరి మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది. ప్రయాణికులకు తిరుపతిలో వసతి కల్పిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లి వేగంగా దర్శనం కల్పించి వెనక్కు తీసుకువస్తారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో బయలుదేరి శ్రీకాళహస్తిలో దర్శనం కల్పిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం విశాఖకు బస్‌ చేరుకుంటుంది. మూడురోజుల టూర్‌కు సంబంధించి ఒకరికి నాలుగువేల రూపాయలతో ప్యాకేజీ రూపొందించారు. అయితే, ఈ ప్యాకేజీ వివరాలకు సంబంధించి ఏపీటీడీసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు