పశువుల ప్రాధాన్యత పండుగ ‘కనుమ’... ఈరోజున ఏం తినాలో తెలుసా?

శనివారం, 14 జనవరి 2017 (18:58 IST)
కనుమ పండుగ రైతులకు ముఖ్యమైన పండుగ. సంవత్సరమంతా పడిన శ్రమకు ఫలితమైన ధాన్యరాశులు నట్టింట నిలిచే రోజు. పాడిని ప్రసాదించిన గోమాతను, పంటకు సాయంగా నిలిచిన బసవన్నను ఈ రోజున రైతులు పూజిస్తారు. ఆ రోజు తెల్లవారగానే పశువులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు – ముఖానికి పసుపు రాసి, కుంకుమబొట్లు పెట్టి పూలమాలలు వేస్తారు. అలంకరణకు కుచ్చులు కడతారు. కొమ్ములకు వెండి కొప్పులు ధరింపచేసి ఆకులో అన్నం పెట్టి తినిపిస్తారు. కొన్ని ప్రాంతాలలో గోపూజతో పాటు పక్షి పూజ కూడా చేస్తారు. 
 
రైతులు సంక్రాంతికి ముందుసాగే కుప్పనూర్పిళ్ళ సందర్భంలో వరివెన్నులను గుత్తులుగా చేర్చి, పిచ్చుకలు తినేందుకై ఇళ్ళలోను, దేవాలయ ప్రాంగణాలలోను కుచ్చులుగా కడతారు. దేవునికి వడ్ల కుచ్చు ఇస్తామని మొక్కుకుని, ఆ మొక్కును కనుమ రోజున తీర్చుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు చక్కగా అలంకరించుకొని తాము పక్షులకు పెట్టదలచుకున్న గింజలతో చెరువు గట్టుకో, బహిరంగ ప్రదేశానికో వెళ్ళి అక్కడ పక్షులకు మేత వేసి వస్తారు. 
 
పక్షులు ఎంత ఎక్కువగా వచ్చి, ఆ ముద్దలను ఆరగిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం. మినుములతో చేసిన వంటకాలను ఈ రోజున తప్పక భుజించాలి. దీని వల్ల రాహు గ్రహ దోషనివారణ జరుగుతుంది.  అందరూ కనుమ రోజు మాంసం తినాలని అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యతను తెలిపే పండుగ. నేడు పశువులను పూజించాలే తప్ప, భుజించకూడదు. నేడు కనీసం గుడ్డు కూడా తినరాదు.

వెబ్దునియా పై చదవండి