వార్త: చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ వల్ల తమ పార్టీ కార్యకర్తల్లో అయోమయం పెరుగుతోందని ఆరోపించిన ప్రజా పార్టీ అధ్యక్షుడు గిరి యాదవ్ ఆ పార్టీ రిజిస్ట్రేషన్ ఆపాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు విజ్ఞప్తి చేశామన్నారు.
చెవాకు: ఎలాగో ప్రజలకు రాష్ట్రంలో ప్రజలందరికీ మరో నామమాత్ర పార్టీ ఉందనే విషయాన్ని చాటి చెప్పగలిగారు. అలాగే మీ పేరుకూడా పత్రికల్లో వచ్చేలా చేసుకున్నారు. పిల్లి గోడు పిల్లిదైతే... ఎలుక గోడు ఎలుకది అన్నట్టు ఉంది మీ కథ.
తమ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని అక్కడ వారు ఆలోచన చేస్తుంటే...ఆ పార్టీ ద్వారా మనం ఎలా లాభపడగలమనే విషయంపై మీరు ఆలోచిస్తున్నట్టుంది. ఆయన మీ పార్టీ పేరు పెట్టుకోలేదు కదా. మీరీ సమయానికే ప్రజల్లోకి చొచ్చుకుపోయిఉంటే, మీ పార్టీ పేరుకు దగ్గరగా కూడా ఆయన పార్టీ పేరు ఉండేది కాదేమో.
ఈ వివాదంలోకి ప్రకాశం పంతులును లాగడం మరీ విడ్డూరంగా ఉంది. ఆయన 1952లో ఈ పార్టీని స్థాపించారని, ఈ కారణంగా సోషలిస్టు భావాలను గౌరవించి, ప్రజారాజ్యం పార్టీ రిజిస్ట్రేషన్ను చిరంజీవి స్వయంగా మానుకోవాలని కోరడంలో న్యాయమేమైనా ఉందా? ఈ ఒక్కటి మాత్రం చెబుతారా? ఇంతకీ మీకు ఇలా మాట్లాడాలని చెప్పిందెవరు?