"కామన్‌వెల్త్"లో 'వెల్త్' అనే పదం 'కామన్' కాదు..!?

FILE
ప్రస్తుతం ట్రెడ్ మిల్‌లో వ్యాయామం చేయడం ఫ్యాషన్‌గా మారింది. మంచి నాణ్యత, ఖరీదైన ట్రెడ్‌మిల్‌ కొనాలంటే రూ.7 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ట్రెడ్ మిల్‌ను రెంట్‌కు తీసుకుంటే రూ.9.75 లక్షలవుతుంది. ఒక ఫ్రిజ్ కొనాలంటే మించిపోతే రూ.8 వేలు పట్టొచ్చు. అయితే రెంట్ తీసుకుంటే రూ.42,000. ఇదేదో సినిమా డైలాగ్ కాదండీ బాబూ.. కామన్వెల్త్‌లో అవినీతి ఇలాగే జరిగింది.

దీనిని బట్టి "కామన్వెల్త్"లో "వెల్త్" ఎప్పుడూ "కామన్" కాదనిపిస్తోంది. ప్రజల పన్ను డబ్బుల్ని భారీగా ఖర్చుచేసి దేశ గౌరవాన్ని అవినీతి ద్వారా మట్టికలుపుతున్నారు. దేశ మర్యాదను కాపాడుతామని చెబుతూ కోట్లాది ధనాన్ని అవినీతి పేరిట దోచుకుంటున్నారు. ఐపీఎల్‌కు మోడీ అవినీతికి చిహ్నమైతే, హాకీ ఇండియా, ఫుట్‌బాల్ వంటి ఇతరత్రా క్రీడా సమాఖ్యల్లోనూ రోజు రోజుకి అవినీతి చాప కింద నీరులా విస్తరిస్తోంది.

ప్రజల ధనాన్ని అధికార దుర్వినియోగంతో ఆస్తులుగా మలుచుకునే బాబులు నానాటికి అధికమవుతున్నారు. కామన్వెల్త్‌ గేమ్స్ కోసం లాంఛనంగా ప్రారంభమైన నెహ్రూ స్టేడియంలో లొసుగులు వెలుగులోకి వస్తున్నాయి. భారీ మొత్తంతో నిర్మించిన ఈ స్టేడియంలో వర్షపు నీరు నిలవడం, పైకప్పు ఎందుకు పనిరాకుండా మారిపోవడాన్ని బట్టి కామన్వెల్త్‌లో ఎంతమేరకు అవినీతి జరిగిందో అవగతమవుతోంది.

ఇంకా కామన్వెల్త్ గేమ్స్‌లో జరిగిన అవకతవకలను గురించి లోతుగా పరిశీలిస్తే.. ఇప్పటికే "కామన్వెల్త్ పోటీలు విఫలమవుగాక..! అంటూ దీవించిన మణిశంకర్ అయ్యర్, అలా చెప్పడానికి గల కారణాన్ని తర్వాత వెల్లడిస్తానని ట్విస్ట్ పెట్టేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలను చూస్తుంటే ఆయన చెప్పేంతవరకు ఆగాల్సిన అవసరం లేదనిపిస్తోంది.
FILE


ఇందుకు కామన్వెల్త్‌లో జరుగుతున్న అవినీతి కుంభకోణమే చక్కని ఉదాహరణ. క్రీడాకారులు వ్యాయామం చేసేందుకు కోసం ట్రెడ్‌మిల్ కొనడంలో అవినీతి చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి.

అది ఎలాగంటే..? ట్రెడ్‌మిల్ యంత్రాన్ని రూ.9.75 లక్షల ఇవ్వడం జరిగిందని, అయితే నాణ్యత గల ట్రెడ్‌మిల్ ధర రూ.7లక్షలు మాత్రమేనని తెలియవచ్చింది. కానీ ఈ వార్తలు వెలుగులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే మరో ఫ్లాష్ న్యూస్ వెలుగులో వచ్చింది. ట్రెడ్ మిల్ కొనుగోలు చేయడానికి ఆ మొత్తాన్ని ఖర్చు చేయలేదని, రెంట్‌గా తెప్పించేందుకు ఆ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలిసింది.

ఇంకా చెప్పాలంటే..? టైమ్స్ నౌవ్ నెట్‌వర్క్ వార్తల ప్రకారం సాధారణ కుర్చీకి రూ.8,378లను ఇవ్వడం జరిగింది. వంద లీటర్ల ఒక రిఫ్రెజిటేర్‌కు రూ.42,202 ఇవ్వడం జరిగింది (ఇది 45 రోజులకు మాత్రమే). అలాగే ఏసీ కొనుగోలు చేయడంలోనూ ఇలాంటి అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.

ఏసీ, ఫ్రిజ్, కుర్చీ వంటి చిన్న చిన్న వస్తువులకే ఇంత మొత్తం వెచ్చించిన మహానుభావులు, ఇక స్టేడియం నిర్మాణాల్లో ఎంత మొత్తాన్ని గుంజేసుంటారో ఆలోచించవచ్చు. ఇదంతా తనకో కామన్వెల్త్ పోటీ నిర్వాహణ కమిటీకో ఎలాంటి సంబంధం లేదంటోన్న సురేష్ కల్మాడీ మాటలను ఎవరు నమ్ముతారు.? నిర్వాహక కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఇలాంటి అవకతవకలు జరుగుతాయా..? అనిపిస్తుంది.
FILE


ఈ విషయమై కామన్వెల్త్ నిర్వాహక కమిటీ కార్యదర్శి లలిత్ పాండే మాట్లాడుతూ.. తమకు ట్రెడ్ మిల్ లాంటి పరికరాలను అందజేసే సంస్థలు, ఒలింపిక్‌ పోటీలకు అందజేసిన ధరలకంటే తక్కువ ధరలకు అందజేసినట్లు హామీ ఇచ్చాయి. అయితే లండన్ ఒలింపిక్ పోటీల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఈ విధంగా భారీ మొత్తాన్ని వెచ్చించి, దేశ గౌరవాన్ని కాపాడుతామని కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చి, భవిష్యత్తులో ఒలింపిక్ వంటి క్రీడలకు భారత్ వేదికయ్యే పేరు కొట్టేస్తామన్న నిర్వాహక కమిటీ, కేంద్ర ప్రభుత్వం అవకతవకలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కామన్వెల్త్ పోటీలకు భారీ అవకతవకలు జరుగుతుంటే.. ఇక ఒలింపిక్ పోటీలైతే ఎలాంటి అవతవకలకు చోటు చేసుకుంటాయో మరి...!.

వెబ్దునియా పై చదవండి