భారతదేశంలో క్రికెటేతర క్రీడాకారుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఈ సాకర్ క్రీడాకారిణి దుస్థితి ప్రత్యక్ష నిదర్శనం. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన ఓ ఫుట్బాల్ క్రీడాకారిణి ఇప్పుడు తమలపాకులు (పాన్ షాపు) అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన రష్మితా పాత్రా అనే 23యేళ్ల క్రీడాకారిణి భారత్ తరపున పలు అంతర్జాతీయ సాకర్ ఈవెంట్లలో పాల్గొంది.
2008లో కౌలాలంపూర్లో జరిగిన అండర్-16 ఏఎఫ్సీ అర్హత పోటీలతో పాటు, 2011లో ఢాకాలో జరిగిన సీనియర్ ఏఎఫ్సీ అర్హత పోటీల్లోనూ పాల్గొని డిఫెండర్గా సత్తా చాటింది. అదే ఏడాది బహ్రెయిన్లో పర్యటించిన సీనియర్ మహిళల జట్టు తరపున ఎంపికైంది. ఆ సిరీస్లో భారత్ 2-1తో విజయం సాధించింది.
తర్వాతి కాలంలో ఫామ్ లోపించడంతో రష్మితను పక్కనబెట్టారు. అటు కెరీర్ కోల్పోయి, ఇటు జీవనోపాధి లేక రష్మిత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గత ఏడాదే పెళ్ళి చేసుకున్న ఆమె ఇప్పుడు ఓ తమలపాకుల దుకాణం పెట్టుకుంది. భర్త సంప్రదాయ మత్స్యకారుడు కావడంతో, అతని సంపాదన అంతంతమాత్రం కావడంతో తానూ ఎంతోకొంత సంపాదించాలని ఈ క్రీడాకారిణి నిర్ణయించుకుంది.
ఫుట్బాల్ కోసం చదువునూ త్యాగం చేశానని, ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ చూస్తే ఎంతో బాధ కలుగుతోందని, అందులో ఆడుతున్న క్రీడాకారులు ఎక్కడివాళ్ళైనాగానీ మెరుగైన పారితోషికం అందుకుంటున్నారని పేర్కొంది. ఇక్కడ మాత్రం క్రీడాసంఘాలు గతంలో ప్రాతినిథ్యం వహించినవాళ్ళను పట్టించుకున్న పాపానపోవని ఆవేదన వ్యక్తం చేసింది.