వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సమయంలో అపశృతి చోటు చేసుకోగా, ఇందులో చీలి సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో అసలైనదేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తన నివేదికలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నివేదిక పోలీసులకు అందడంతో దర్యాప్తులో ఇది ఒక ముఖ్యమైన ఆధారంగా మారింది.
పర్యటన సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద సింగయ్య నలిగిపోతున్న దృశ్యాలు ఒక సెల్ఫోన్ ఫోనులో రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆ వీడియో వైరల్ అయింది. అయితే, ఈ వీడియో నకిలీదని, జగన్ను ఈ కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ చేశారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు ఆ వీడియో క్లిప్లను, ఘటనా స్థలంలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వీడియో రికార్డ్ చేసిన సెల్ఫోన్ ఐడీ, అది ఉన్న లొకేషన్ వంటి సాంకేతిక వివరాలను విశ్లేషించిన నిపుణులు, ఆ వీడియో ఒరిజినల్ అని, ఎడిటింగ్ జరగలేదని నిర్ధారించారు.
కాగా, ఈ కేసులో తన ప్రమేయం లేదని, తనపై నమోదు చేసిన ఎఫ్ఎస్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై జులై 1వ తేదీన ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగనుంది. అదే రోజున పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ మొన్న కోర్టుకు అందించారు. పూర్తి సాంకేతిక ఆధారాలు సమర్పించేందుకు గడువు కోరగా, కోర్టు అందుకు అంగీకరించింది.