ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు తూర్పు-పశ్చిమ ద్రోణి కొనసాగనుంది.
మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా మీదుగా అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఈ ద్రోణి కొనసాగనుంది. సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలది దక్షిణ దిశగా ద్రోణి వంగి ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ గాలులు వీయనున్నాయి. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.