దాదాపు ఏడు నెలల పాటు గాయం కారణంగా టెన్నిస్కు దూరమైన మాజీ ప్రపంచ నెంబర్ వన్ మరియా షరపోవా, ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్లో తిరిగి అడుగిడనుంది. ఇండియన్ వెల్స్ డబుల్స్ విభాగంలో, ఎలెనీ వెస్నీనాతో షరపోవా బరిలోకి దిగనుంది.
ఈ సందర్భంగా షరపోవా మాట్లాడుతూ, ఏడు నెలల తర్వాత తిరిగి టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, త్వరలో సింగిల్స్ విభాగంలోనూ రాణించేందుకు ప్రయత్నిస్తానని షరపోవా తెలిపింది. కోర్టులో గట్టిపోటీని ప్రదర్శించేందుకు తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నానని, మైదానంలో మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు కృషి చేస్తానని షరపోవా వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. గాయాల కారణంగా ప్రతిష్టాత్మక బీజింగ్ ఒలింపిక్స్కు షరపోవా దూరమైన సంగతి తెలిసిందే. అదేవిధంగా యూఎస్ ఓపెన్, జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్లలో కూడా షరపోవా పాల్గొనలేదు.
మరోవైపు.. మాజీ ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు, స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్లు కూడా ఇండియన్ వెల్స్ టోర్నీలో తలపడనున్నారు. గాయాల కారణంగా యూఎస్ ఓపెన్, డేవిస్ కప్ టోర్నీలకు వీరిద్దరూ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాయాల నుంచి తాము పూర్తిగా కోలుకున్నామని, ఇండియన్ వెల్స్ కోర్టులో గట్టిపోటీని ప్రదర్శిస్తామని తమ తమ అధికారిక వెబ్సైట్లలో వారు పేర్కొన్నారు.
అదేవిధంగా.. ఫిబ్రవరిలో జరిగిన దుబాయ్ ఛాంపియన్షిప్, డేవిస్ కప్ టోర్నీలకు నాదల్, ఫెదరర్ తరహాలో.. ముర్రే కూడా వైరస్ ప్రభావంతో దూరమయ్యాడు. ఇండియన్ వెల్స్ సెమీఫైనల్లో రోజర్ ఫెదరర్-ఆండీ ముర్రేలు తలపడనున్నారు.