చైనా రాజధాని బీజింగ్ వేదికగా ఆగస్టులో జరిగే ఒలింపిక్స్ పోటీలు కాలుష్య మేఘాల మధ్య జరుగనున్నాయి. ఆయా కంపెనీలు వదిలే కాలుష్యాన్ని నివారించి ఒలింపిక్ క్రీడలను సజావుగా నిర్వహించటం ఓ సవాలుగా మారింది. అయినప్పటికీ చైనా ప్రభుత్వం పోటీల నిర్వహణకు సర్వం సిద్ధమని ప్రకటించడం గమనార్హం. బీజింగ్ (పెకింగ్) నగరం తొలిసారి ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిస్తుంది.
ప్రపంచ దేశాలకు చెందిన వేలాది మంది క్రీడాకారులు బీజింగ్కు ఈ సందర్భంగా వస్తున్నారు. స్థానిక కాలుష్యం వారి ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించవచ్చని నిపుణులు అంటున్నారు. విదేశీ పర్యావరణ నిపుణలు ప్రస్తుతం బీజింగ్ నగరానికి చేరుకుని కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టామని చైనా ప్రభుత్వం వారికి అభయమిచ్చింది.
బీజింగ్ నగరంలోని అనేక కర్మాగారాలు మూసివేయించడంతో పాటుగా, పాత రవాణా వాహనాలు రోడ్లపై తిరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. బీజింగ్ ఒలింపిక్స్లో గంటకు పైగా జరిగే పోటీలను ఇక్కడ నిర్వహించరాదన్న ఆలోచనలో ప్రపంచ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఉంది.
ఒలింపిక్స్ కోసం నిర్మిస్తున్న కొన్ని స్టేడియాలు పనులు ఇంకా పూర్తికాలేదు. అలాగే బీజింగ్ కొత్త విమానాశ్రయం మూడో టెర్మినల్ పనులు జరుగుతున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు జులై చివరినాటికి పూర్తిచేయాలని చైనా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.