నీరాజ్‌ చోప్రాకు కానుకల వర్షం - నేటితో ఒలింపిక్స్ క్రీడలకు ముగింపు

ఆదివారం, 8 ఆగస్టు 2021 (13:44 IST)
జపాన్ రాజధాని టోక్యో నగర వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020 క్రీడల్లో ఆదివారంతో ముగియనున్నాయి. ఇప్పటివరకు భారత్ ఈ ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించింది. అందులో ఒక బంగారు పతకం కూడా ఉంది. అలాగే, రెండు రజతాలు, నాలుగు కాంస్య పథకాలు ఉన్నాయి. కాగా వీరందరికీ ఇప్పటికే ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించాయి. 
 
అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బిసిసిఐ కూడా టోక్యో ఒలింపిక్స్‌లో పథకాలు వచ్చిన వారందరికీ కూడా రివార్డులు ప్రకటించింది. ముఖ్యంగా జావలిన్ త్రో విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న సరికొత్త రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రాకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించింది. 
 
అలాగే, రజత పతకాలు సాధించిన మీరాబాయి చాను, రవి దహియాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నారు. కాంస్యాలు సాధించిన పీవీ సింధు, భజరంగ్ పునియా, లవ్లీనా బొర్గోహైన్ లకు రూ.25 లక్షల చొప్పున ప్రదానం చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో వెల్లడించారు.
 
మరోవైపు, ఈ ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. కొవిడ్‌ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగానే నిర్వహించనున్నారు. జపాన్‌ జాతీయ స్టేడియంలో జరగనున్న ముగింపు వేడుకలు సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమవనున్నాయి. 
 
బాణాసంచా వెలుగు జిలుగులు, జపాన్‌ పాప్‌ సంగీతం కనువిందు చేయనుంది. ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు ముగింపు వేడుకల్లో ప్రసంగించనున్నారు. ప్యారీస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్‌ గురించి ఒక పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్‌ టార్చ్‌ను పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందించడంతో ముగింపు వేడుకలు ముగిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు