ఫిఫా వరల్డ్ కప్ : 24 ఏళ్ళ తర్వాత గట్టి ఎదురుదెబ్బ!

మంగళవారం, 8 జులై 2014 (11:45 IST)
ఫిఫా వరల్డ్ కప్‌లో 24 ఏళ్ళ తర్వాత సెమీస్ చేరిన అర్జెంటీనా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫార్వర్డ్ ఏంజెల్ డి మారియా తొడకండరాల గాయంతో సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బెల్జియంతో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మారియా పలుమార్లు కుడి తొడ నొప్పితో విలవిల్లాడాడు. దీంతో, మ్యాచ్ పూర్తికాకముందే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. 
 
జట్టు వైద్యుడు డానియెల్ మార్టినెజ్ మాట్లాడుతూ, ఇది 'ఫస్ట్ డిగ్రీ' గాయం అని, తీవ్రత దృష్ట్యా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగే సెమీఫైనల్‌కు దూరంగా ఉంటాడని తెలిపారు. కాగా, ఇదే తరహా గాయంతో బాధపడిన మరో స్ట్రయికర్ సెర్గియో అగెరో ఫిట్‌గా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో, అర్జెంటీనాకు కాస్తంత ఊరట లభించింది. మారియోకు తోడు అగెరో కూడా దూరమై ఉంటే అటాకింగ్ భారమంతా సూపర్ ఫార్వర్డ్ లయొనెల్ మెస్సీ ఒక్కడే మోయాల్సి వచ్చేది.

వెబ్దునియా పై చదవండి