మెస్సీ ఆడితే అతని జెస్సీలు తగలబెట్టండి.. పాలస్తీనా ఫుట్‌బాల్ చీఫ్ పిలుపు

సోమవారం, 4 జూన్ 2018 (13:35 IST)
ఫిపా వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌లో భాగంగా వచ్చే శనివారం అర్జెంటీనా, ఇజ్రాయేల్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు రాజకీయ రంగు పులుముకుంది. ఈ మ్యాచ్‌కు జెరుసలెం వేదికకానుండగా, దీన్ని పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఆడితే.. అతని జెర్సీలు తగలబెట్టాలని తమ దేశ ఫుట్‌బాల్ అభిమానులకు అసోసియేషన్ చీఫ్ జిబ్రిల్ రజౌబ్ పిలుపునిచ్చాడు. ఇది ఇపుడు వివాదాస్పదంగా మారింది.
 
నిజానికి ఈ మ్యాచ్ హైఫాలో జరగాల్సి ఉన్నా.. ఇజ్రాయెల్ అధికారులు మ్యాచ్‌ను జెరుసలెంకు తరలించేలా ఒత్తిడి తెచ్చారు. దీంతో జెరుసలెంలోని టెడ్డీ కొలెక్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఇందులో మెస్సీ బరిలోకి దిగుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఇజ్రాయేల్ అభిమానులు మెస్సీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ మ్యాచ్‌ను ఇజ్రాయేల్ తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నదని విమర్శిస్తూ పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ చీఫ్ జిబ్రిల్.. అర్జెంటీనా అసోసియేషన్ చీఫ్ క్లాడియో తపియాకు ఓ లేఖ రాశారు. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న స్టేడియం పశ్చిమ జెరుసలెంలో ఉంది. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసలెంను గుర్తించి, తమ రాయబార కార్యాలయాన్ని కూడా జెరూసలేంకు తరలించారు. దీనిపై పాలస్తీనియన్లు రగిలిపోతున్నారు. కానీ, పాలస్తీనియన్లు మాత్రం ఎప్పటి నుంచో తూర్పు జెరుసలెంను తమ రాజధానిగా చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసేలా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు