నిద్రపోయిన డ్రైవర్.. బ్రిడ్జిపై నుంచి బస్సు బోల్తా... 21 మంది క్రీడాకారుల మృతి

ఠాగూర్

ఆదివారం, 1 జూన్ 2025 (16:01 IST)
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన పైనుంచి బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 21 మంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో పాటు బస్సును అతివేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇందులో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. 
 
ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ (ఎఫ్ఆర్ఎస్సీ) వెల్లడించిన వివరాల మేరకు.. ఈ ప్రమాదంతో ఏ వాహనానికీ సంబంధంలేదు. క్రీడాకారులు ప్రయాణిస్తున్న బస్సు మాత్రమే ప్రమాదానికి గురైంది. రాత్రిపూట సుధీర్ఘ ప్రయాణం కారణంగా డ్రైవర్ అలసిపోవడం లేదా అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగివుండొచ్చని పేర్కొంది.
 
సుమారు 1000  కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒగున్ రాష్ట్రంలో జరిగిన 22వ జాతీయ క్రీడా ఉత్సవాల నుంచి అథ్లెట్లు ఉత్తర నైజీరియాలోని కానో నగరానికి తిరిగి వస్తున్నారు. వీల్ చైర్ బాస్కెట్ బాల్ నుంచి పశ్చిమ ఆఫ్రికా సంప్రదాయ కుస్తీ వరకు అనేక క్రీడలు జరిగిన ఈ పోటీలు దేశ ఐక్య, బలం, స్థితిస్థాపకతకు నిదర్శనమని బోలా టినుబు ఇటీవల వ్యాఖ్యానించారు. 
 
నైజీరియాలో రహదారుల నిర్వహణ సరిగా లేకపోవడం, వాహనాల అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన తదితర కారణాల వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గత యేడాది నైజీరియాలో జరిగిన 9570 రోడ్డు ప్రమాదాలు జరగగా వాటిలో 5421 మంది మరణించారని ఎఫ్ఆర్ఎస్సీ నివేదిక వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు