కేన్సర్ చిన్నారి కోసం రియో ఒలింపిక్స్ రజత పతకం వేలానికి పెట్టిన క్రీడాకారుడు

శుక్రవారం, 26 ఆగస్టు 2016 (09:37 IST)
మూడేళ్ల చిన్నారి వైద్యం కోసం ఓ క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో తాను గెలుచుకున్న ర‌జ‌త‌ప‌త‌కాన్ని వేలం వేయడానికి సిద్ధపడ్డాడు. ఆ క్రీడాకారుడు ఎవరో కాదు పోలెండ్‌కు చెందిన డిస్కస్ త్రో క్రీడాకారుడు పియోటర్ మలచౌస్కి(33). ఈ విషయాన్ని తనే స్వయంగా ఫేస్‌బుక్‌లో ఖతాలో పేర్కొన్నాడు. చిన్నారి ఒలెక్ రెండేళ్ల నుంచి కంటి కేన్సర్‌తో బాధపడుతున్నాడని, సాయం అందించాలని కోరుతూ బాలుడి తల్లి రాసిన ఉత్తరం తనకు అందిందని ఆయన అన్నారు. మెరుగైన చికిత్స ద్వారా పరిస్థితి మెరుగవుతుందని ఆమె రాసినట్టు తెలిపాడు. 
 
దీంతో ఆ బాలుడి చికిత్స కోసం మెడల్ వేలం వేయడంతో వచ్చే సొమ్మును అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించాడు. రియోలో స్వర్ణం పతకం సాధించాలని చాలా పోరాడాను. కానీ ఇప్పుడంతకంటే విలువైన దాని గురించి పోరాడాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిస్తున్నా అని పియోటర్ సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చాడు. 
 
మీరు సాయం చేస్తే నేను సాధించిన రజత పతకం చిన్నారి ఒలెక్‌కు బంగారం పతకం కంటే గొప్పగా మారుతుంద‌ని పేర్కొన్నాడు. ఈ పోస్టులు పెట్టిన కాసేపటి తర్వాత మరో పోస్టులో సక్సెస్ అని రాస్తూ సాయం అందించే చేతులు ముందుకొచ్చినట్టు ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. 

వెబ్దునియా పై చదవండి