విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

ఠాగూర్

శుక్రవారం, 20 జూన్ 2025 (14:18 IST)
ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపుపొందిన కాగ్నిజెంట్ తన కొత్త కార్యాలయాన్ని సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలో నెలకొల్పనుంది. ఇందుకోసం రూ.1582 కోట్ల మేరకు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ ఐటీ క్యాంపస్ వల్ల ఏకంగా 8 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖలోని కాపులుప్పాడులో మొత్తం 21.31 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనుంది. 
 
విశాఖపట్టణంలో ఐటీ కార్యకలాపాలను విస్తరించాలనే ఉద్దేశ్యంతో కాగ్నిజెంట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, విద్య, పరిశ్రమల శాఖామంత్రి నారా లోకేశ్‌తో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రణాళికలను వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.1582 కోట్ల మేరకు భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 
 
కాగ్నిజెంట్ సంస్థ తమ క్యాంపస్ ఏర్పాటు కోసం విశాఖలోని కాపులుప్పాడు ప్రాంతంలో 21.31 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా ఈ భూమిని ఎకరా కేవలం 99 పైసల నామమాత్రపు ధరకే కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. 
 
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ క్యాంపస్‌ను నిర్మించి కార్యకలాపాలను సాగించడానికి సిద్ధంగా ఉన్నామని కాగ్నిజెంట్ ప్రతినిధులు మంత్రి నారా లోకేశ్‌కు వివరించారు. ఈ పెట్టుబడి ప్రతిపాదన కార్యరూపం దాల్చితే విశాఖ ఐటీ రంగంలో మరింత అభివృద్ధి సాధించడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు భారీగా లభించనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు