ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపుపొందిన కాగ్నిజెంట్ తన కొత్త కార్యాలయాన్ని సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలో నెలకొల్పనుంది. ఇందుకోసం రూ.1582 కోట్ల మేరకు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ ఐటీ క్యాంపస్ వల్ల ఏకంగా 8 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖలోని కాపులుప్పాడులో మొత్తం 21.31 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనుంది.
విశాఖపట్టణంలో ఐటీ కార్యకలాపాలను విస్తరించాలనే ఉద్దేశ్యంతో కాగ్నిజెంట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, విద్య, పరిశ్రమల శాఖామంత్రి నారా లోకేశ్తో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రణాళికలను వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.1582 కోట్ల మేరకు భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ క్యాంపస్ను నిర్మించి కార్యకలాపాలను సాగించడానికి సిద్ధంగా ఉన్నామని కాగ్నిజెంట్ ప్రతినిధులు మంత్రి నారా లోకేశ్కు వివరించారు. ఈ పెట్టుబడి ప్రతిపాదన కార్యరూపం దాల్చితే విశాఖ ఐటీ రంగంలో మరింత అభివృద్ధి సాధించడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు భారీగా లభించనున్నాయి.