రియో ఒలింపిక్స్‌లో లలితా బాబర్ అదుర్స్.. 3వేల మీటర్ల ఛేజ్‌ ఫైనల్లోకి ఎంట్రీ

ఆదివారం, 14 ఆగస్టు 2016 (11:40 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ లలితా బాబర్ సత్తా చాటుకుంది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆమె ఫైనల్‌ రౌండ్‌కు దూసుకెళ్లింది. తద్వారా పీటీ ఉష తర్వాత ఒలింపిక్‌ పతక ఈవెంట్‌కు అర్హత సాధించిన ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా ఆమె రికార్డు సాధించింది. దీంతో  సోమవారం జరిగే ఫైనల్స్‌లో ఆమె పతక అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 1984 ఒలింపిక్స్‌లో పీటీ ఉష 400 మీటర్ల హర్డిల్స్‌లో పతక రౌండ్‌కు చేరుకోగా, ఇన్నేళ్ల విరామం తర్వాత లలిత ఆ స్థాయి ప్రదర్శన చేసింది. 
 
శనివారం జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌ రెండో హీట్‌లో పోటీపడ్డ లలిత 9 నిమిషాల 19.76 సెకండ్ల టైమింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో బాబర్ జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టింది. గత ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన లలిత.. సహచర అథ్లెట్‌ సుధా సింగ్‌ (9:26.55 నిమిషాలు) పేరిట ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది. అయితే, ఈ విభాగంలో సుధా సింగ్‌ తీవ్రంగా నిరాశ పరిచింది. 9:43.29 నిమిషాల టైమింగ్‌తో 30వ స్థానంతో సరిపెట్టింది. ఆయా హీట్స్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారు నేరుగా ఫైనల్‌కు చేరుకున్నారు.

వెబ్దునియా పై చదవండి