బిడ్డ తల్లి సక్సెస్ : హోబర్ట్ క్వార్టర్స్‌లో సానియా

బుధవారం, 15 జనవరి 2020 (11:00 IST)
భారత టెన్నిస్ ఏస్, హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జా తల్లిగా మారిన తర్వాత వేసిన తొలి అడుగు విజయవంతంమైంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంటే రెండున్నరేళ్ళ తర్వాత ఆమె తిరిగి రాకెట్ చేతపట్టి మైదానంలోకి దిగింది. అయితే, ఆమె ఆడిన తొలి మ్యాచ్‌లోని విజయం సాధించింది. ఫలితంగా హోబర్ట్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. 
 
అస్ట్రేలియా వేదికగా హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీ జరుగుతోంది. ఇందులో మహిళల డబుల్స్‌ విభాగంలో ఉక్రెయిన్ క్రీడాకారిణి నాదియ కిచినోక్‌తో కలిసి సానియా మీర్జా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో సానియా జోడీ 2-6, 7-6(3), 10-3 తేడాతో ఒకసన కలష్నికోవా(జార్జియా), మియుకాటో(జపాన్)జోడీని కంగుతినిపించింది.
 
దాదాపుగా గంటన్నరకు‌పైగా సాగిన ఈ పోటీ హోరాహోరీగా సాగింది. తొలి సెట్లో ప్రత్యర్థి జోడీకి తేలిగ్గా లొంగిపోయిన సానియా జోడీ రెండో సెట్లో గట్టి పోటీ నిస్తూ.. విజయం సాధించింది. మ్యాచ్ నిర్ణయాత్మకమైన మూడో సెట్ నువ్వా? నేనా? అన్నట్లు ఆట సాగింది. చివరికి సానియా-నాదియా జోడీ ఆట ముందు కలష్నికోవా-మియుకాటో  జోడీ నిలువలేకపోయింది.
 
ఈ విజయంపై సానియా మీర్జా ట్వీట్ చేసింది. "ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. నా తల్లిదండ్రులు, నా కుమారుడు నాకు మద్దతుగా నిలిచారు. దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత టెన్నిస్ ఆడుతూ తొలి రౌండ్‌లో నెగ్గాను. నేను విజయం సాధించాలని సందేశాలు పంపిన వారందరికి ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు